Ladakh Avalanche: లడఖ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ హిమపాతం కారణంగా వాహనాలపై మంచు చరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. శుక్రవారం (మార్చి 27) జమ్మూ కాశ్మీర్లోని జోజిలా పాస్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరికొందరు గాయపడగా, ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక బృందాలు ముమ్మరంగా రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి.
అకస్మాత్తుగా కూలిన మంచు చరియలు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య అకస్మాత్తుగా భారీ హిమపాతం సంభవించడంతో అక్కడి రహదారిపై ప్రయాణిస్తున్న ఐదు వాహనాలు మంచు కింద కూరుకుపోయాయి. వాటిలో ఒకటి ప్రయాణికులతో వెళ్తున్న వాహనం కావడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్తుండగా ప్రమాదం
ప్రమాదానికి గురైన వాహనాలు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి కార్గిల్ వైపు ప్రయాణిస్తున్నాయి. జోజిలా పాస్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద మంచు చరియలు విరిగిపడటంతో వాహనాలు పూర్తిగా మంచు కింద చిక్కుకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే గందర్బల్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంచు తొలగింపు యంత్రాలతో వాహనాలను బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
జోజిలా పాస్ ఎందుకు ప్రమాదకరం?
జోజిలా కనుమ హిమాలయ పర్వతాల్లో అత్యంత ప్రమాదకరమైన మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది కాశ్మీర్ లోయను లడఖ్ ప్రాంతంతో కలిపే కీలక మార్గం. శ్రీనగర్ – లేహ్ జాతీయ రహదారి (NH-1) పై సుమారు 3,528 మీటర్ల ఎత్తులో ఈ మార్గం ఉంది. ఇక్కడి రహదారులు చాలా ఇరుకుగా ఉండటంతో పాటు, వాతావరణం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. భారీ మంచు పడటం, తరచూ హిమపాతాలు సంభవించడం వల్ల శీతాకాలంలో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు.
వ్యూహాత్మకంగా కీలక మార్గం
జోజిలా పాస్ లడఖ్ ప్రాంతానికి పౌర రవాణా మాత్రమే కాకుండా భారత సైన్యానికి కూడా అత్యంత కీలకమైన మార్గం. సైనిక సరఫరాలు, సామాగ్రి రవాణాకు ఇది ప్రధాన మార్గంగా పనిచేస్తుంది. అందుకే ఈ మార్గాన్ని ఎప్పటికప్పుడు తెరిచి ఉంచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ప్రత్యేక చర్యలు చేపడుతుంది.
లడఖ్ ఎల్జీ స్పందన
ఈ ఘటనపై లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా స్పందించారు. హిమపాతం ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్గిల్ జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పారు.
“జోజిలా వద్ద హిమసంపాతం సంభవించిన దురదృష్టకర వార్త విన్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించాను. అన్ని ప్రభుత్వ సంస్థలను హై అలర్ట్లో ఉంచాం. పరిస్థితిని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను,” అని ఆయన సోషల్ మీడియా వేదిక Xలో పేర్కొన్నారు.
ఇంకా కొనసాగుతున్న రక్షణ చర్యలు
ప్రస్తుతం అక్కడ భారీగా మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలు సవాళ్లతో సాగుతున్నాయి. అయినప్పటికీ రిస్క్యూ బృందాలు నిరంతరం పనిచేస్తూ చిక్కుకుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక శోధన చర్యలు కూడా చేపట్టారు.
ఇవీ చదవండి: Snow color: మంచుకెందుకు తెలుపు రంగు? నీటికెందుకు లేదు వర్ణం!
New York City: అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్… అత్యవసర పరిస్థితి 20 రాష్ట్రాల్లో
Watch Video: తన బోనులోకి చొరబడ్డ పాముతో హోరాహోరీ… ఐదు రోజుల పోరాటం తర్వాత సింహం మృతి
