Ramachandra Yadav: టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం వెయ్యి గోవులు, లక్ష ఆవులను ఇస్తానంటూ భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ముందుకొచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.
’’తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రత, చరిత్ర, మహత్యం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు, నేను ఆ ఏడు కొండలు కొలువై ఉన్న జిల్లాలో ఆ స్వామివారి పాదాల చెంతన.. ఆ కొండల నీడన పుట్టి, పెరిగిన వాళ్ళమే..! స్వామివారి ధూప, దీప, నైవేద్యం పవిత్రత.., లడ్డూ ప్రసాదం తయారీ గురించి ఇటీవల వస్తున్నవార్తలు, లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం మీరే స్వయంగా వెల్లడించారు.. ఈ విషయం నన్ను, నాతో సహా కోట్లాది భక్తులను బాధించాయి.. మనసుని కలచివేశాయి.. ఈ విషయం తెలిసిన వెంటనే స్వామి చెంతకు వెళ్లాలని, స్వామి పవిత్రతను రక్షించుకోవాలని.. ఏడు కొండల పవిత్రతను కాపాడాలని నేను స్వయంగా నా ఇంటి నుండి పాదయాత్ర చేసాను. నాతో సహా వందలాది మంది భక్తులు నేను చేపట్టిన “తిరుమల పరిరక్షణ పాదయాత్ర”లో భాగస్వాములయ్యారు.. అదే సందర్భంలో స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన “మెట్లోత్సవం” కూడా నిర్వహించాం.. ఈ నేపథ్యంలో తిరుమల పరిరక్షణ, పవిత్రతపై కొన్ని అత్యంత కీలకమైన సూచనలు, నా వంతుగా సాయం, సలహాలు మీ దృష్టికి తీసుకువస్తున్నాను..
సొంత డెయిరీ ఏర్పాటు, నేను సిద్ధం!
రోజుకి సగటున సుమారుగా లక్ష మంది భక్తులు దర్శించుకుని.. సుమారుగా రూ. 5 కోట్లు ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేము..? ఓ సారి ఆలోచించండి! స్వామి చెంతనే ఆవులను పెంచి, పోషించి, పాలు ఉత్పత్తి ద్వారా నెయ్యి తయారు చేసి ఆ స్వామివారి పూజ, దీప, నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల తయారీలో వాడితే అంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉండదు. బయట కొనుగోలు చేసే కంటే సొంతంగా తయారు చేసుకోవడం అత్యుత్తమ మార్గం..
* మీ ప్రభుత్వం దీనికి సిద్ధమైతే నేనే స్వయంగా నా తరపున వేయి గోవులను ఇస్తాను. అలాగే మరో లక్ష గోవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను. నేను వేయి ఇవ్వడంతో పాటూ, నా లాంటి భక్తులను సంప్రదించి సమీకరించగలను.
* ఈ లక్ష గోవులతో రోజుకి కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయవచ్చు.. ఈ పాలతో రోజుకి 50 వేల కిలోల వెన్న తయారవుతుంది. ద్వాని ద్వారా 30 వేల కిలోల నెయ్యి సొంతంగా తయారు చేయవచ్చు..
* ఇలా తిరుమలలో ఉత్పత్తి చేసిన నెయ్యితో స్వామి అవసరాలకు సగం వాడగా, మిగిలిన మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాలకు పంపించవచ్చు.. తద్వారా తిరుమల సహా రాష్ట్రంలోని ఏ ఒక్క ఆలయంలో కూడా కల్తీ నెయ్యి అనే సమస్య ఉండదు.. పైగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి మనమే సొంతంగా తయారు చేయించడం అత్యుత్తమ మార్గం..
* ఈ లక్ష గోవులను సంరక్షించి, గోశాల నిర్వహణకు పది వేల మంది గోపాలులను నియమించే వీలుంటుంది.. ఈ అందర్నీ యాదవ సామజికవర్గం నుండి తీసుకోవడం ద్వారా వారికి ఉపాధి, కులవృత్తికి అవకాశం, స్వామి వారి సేవకు అవకాశం కల్పించినట్టు అవుతుంది. డెయిరీని ఉన్నతంగా, ఉత్తమంగా నిర్వహించే అనుభవం, అర్హత, సమర్ధత యాదవ సామాజికవర్గాల వారికి ఉంటుంది.. ఈ సొంత డెయిరీ ఉత్పత్తి చేసే పాలు, ఉప ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఈ గోపాలులకు జీతభత్యాలు సమకూర్చే అవకాశం ఉంటుంది..
ధార్మికత కాపాడండి!
తిరుమల ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ధార్మిక సంస్థ.. ఇది రాజకీయ పునరావాస కేంద్రమో, వ్యాపార ఆస్థానమో, కార్పొరేట్ లాబీయింగుల ఆవాసమో కాదు, కారాదు! ఈ క్షేత్రం పరిసరాలు, పరివాహకం, ప్రాంగణం మొత్తం ఆద్యంతం భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మికత, ధార్మికతతో నిండిపోవాలి. అప్పుడే తిరుమల పవిత్రత, పరిరక్షణ సాధ్యమవుతుంది. అందుకే మీరు ఏర్పాటు చేయబోయే తిరుమల దేవస్థానం పాలకమండలిలో చైర్మన్ సహా సభ్యులు అందరూ ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులుగా ఉండేలా చూడగలరని మనవి. రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులను ఈ బోర్డులో స్థానం కల్పించకుండా ఆద్యంతం భక్తి, శ్రద్ధలతో స్వామిని కొలిచే నిజమైన భక్తులకు మాత్రమే స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాను.
“గత అయిదేళ్ల అరాచకాలు, అవినీతి, పాపాలతో అపవిత్రమైన ఆ ఏడు కొండల సన్నిధిని పరిరక్షించుకుని, పవిత్రత కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. మీరు మనసు పెడితే ఇది ఆచరణ సాధ్యమవుతుంది. ఆలోచించండి, మరోసారి చెప్తున్నా వేయి గోవులు నేనే సొంతంగా ఇచ్చి, మరో లక్ష గోవులను ఉచితంగా సమకూరుస్తాను.. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ.. బోడె రామచంద్ర యాదవ్, ఆ ఏడుకొండల నీడన పెరిగిన శ్రీవారి భక్తుడు!’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి
Tirumala: నేటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు
Tirumala Laddu: నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
