బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

AP Capital Amaravathi: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం… ఏపీ రాజకీయాల్లో జోరుగా రాజధాని చర్చ

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 2 ఏప్రిల్ 2026

AP Capital Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంతో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ రాజధాని అంశం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన చర్చలో దేశంలోని ప‌లు రాజకీయ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అందులో 10 పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది.

బిల్లుపై చర్చ సందర్భంగా వివిధ పార్టీల ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అమరావతిని రాజధానిగా నిలబెట్టాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు. రైతులు ఇచ్చిన భూములు, వారి త్యాగాలు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావిస్తూ బిల్లుకు మద్దతు తెలిపారు.

రైతుల త్యాగాలపై చర్చ
టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తు చేశారు. “ఆ తల్లుల కన్నీళ్లు, రైతుల ఆశలే ఈ చట్టానికి పునాది” అని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణం కేవలం రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ కూడా రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ, భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయి ప్రయోజనాలు కల్పించాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

బీజేపీ, టీడీపీ మద్దతు
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే చేస్తున్న రాజకీయాలకు ఈ బిల్లు చెక్ పెట్టిందని విమర్శించారు. బీజేపీ MP పురందేశ్వరి మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తులో కూడా స్థిరంగా రాజధానిగా కొనసాగాలని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కూడా బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అయితే అమరావతి అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

చంద్రబాబు స్పందన
లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, అమరావతికి చట్టబద్ధత రావడం ఆంధ్రుల గౌరవంగా అభివర్ణించారు. “ఇక భవిష్యత్తులో అమరావతిని ఒక్క అంగుళం కూడా కదిలించలేరు” అని అన్నారు. రాజధాని అంశంపై జరిగిన అనిశ్చితి ముగిసిందని చెప్పారు.

వైసీపీ వాకౌట్
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లును వ్యతిరేకించింది. పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూపంలో బిల్లును మద్దతు ఇవ్వలేమని చెప్పారు. “అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రస్తుత బిల్లుకు వ్యతిరేకం” అని స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

జగన్ విమర్శలు
ఇదిలా ఉండగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతి అంశంపై మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో తీర్మానం తీసుకురావడం ఒక రాజకీయ డ్రామా మాత్రమేనని పేర్కొన్నారు. “మావిగన్‌ను రాజధానిగా ప్రకటించండి… వాళ్లు ఒకసారి సవరణ చేస్తే మళ్లీ మార్చలేమా?” అంటూ వ్యాఖ్యానించారు. అమరావతిపై భారీగా ఖర్చు చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అమరావతి రాష్ట్రానికి “గుదిబండ”లా మారే ప్రమాదం ఉందని కూడా అన్నారు.

కూటమి నేతల కౌంటర్లు
జగన్ వ్యాఖ్యలకు కూటమి నేతలు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రజలను నవ్వులపాలు చేయడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. మంత్రి పి. నారాయణ మాట్లాడుతూ జగన్ చెప్పిన మూడు రాజధానుల సిద్ధాంతం పూర్తిగా ముగిసిపోయిందని అన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణాన్ని జగన్ అడ్డుకోవాలని ప్రయత్నించినా ఇక ఒక్క ఇటుకను కూడా తాకలేరని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ అమరావతికి చట్టబద్ధత రావడాన్ని జీర్ణించుకోలేక కొందరు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు.

మళ్లీ వేడెక్కిన రాజధాని రాజకీయాలు
లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. కూటమి ప్రభుత్వం అమరావతిని నిర్మిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేస్తుండ‌గా, మరోవైపు రాజ‌ధాని అమ‌రావ‌తిలో అవినీతి, దోపిడీ చేస్తున్నార‌ని వైసీపీ తీవ్రంగా మండిప‌డుతోంది.

రాజధాని అంశంపై వచ్చే రోజుల్లో రాజకీయంగా మరింత వేడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: Amaravati Resolution: అమరావతి శాశ్వత రాజధాని.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
Chandrababu at Delhi : ఢిల్లీలో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అమరావతికి చట్టబద్ధత, పోలవరం నిధులు, ఫ్రైట్ కారిడార్లు, మఖానా బోర్డు ఏర్పాటుకు విజ్ఞప్తి

ట్యాగ్స్: , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading