Takamasa Osawa: బిర్యానీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, లక్నో వంటి నగరాలు. కానీ జపాన్కు చెందిన ఓ చెఫ్ మాత్రం బిర్యానీని తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. చిన్న వయసులో భారత్లో తిన్న ఒక్క ప్లేట్ బిర్యానీ అతడి జీవితాన్నే మార్చేసింది. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్లుగా ఒక్క వంటకంపైనే పరిశోధనలు చేస్తూ, వివిధ ప్రాంతాల రుచులను అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు టోక్యోలో కేవలం 10 సీట్ల రెస్టారెంట్ నడుపుతూ మిచెలిన్ బిబ్ గౌర్మాండ్ గుర్తింపును కూడా సాధించాడు. అతడే జపాన్కు చెందిన తకమాసా ఒసావా.
ఒక్క ప్లేట్ బిర్యానీ.. జీవితాన్నే మార్చేసింది
తకమాసా ఒసావా 20 ఏళ్ల వయసులో ఆఫీస్ ఉద్యోగిగా ఉన్నప్పుడు తొలిసారి భారత్కు వెళ్లాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో బిర్యానీ అనే పేరు చూసి అసలు అది ఏంటో తెలియక ఆసక్తితో ఆర్డర్ చేశాడు. అయితే ఆ ఒక్కసారి రుచి చూసిన తర్వాత బిర్యానీపై అతడికి ఏర్పడిన ఆసక్తి క్రమంగా పిచ్చిగా మారిపోయింది. చిన్నప్పటి నుంచే ఫ్లేవర్డ్ రైస్ అంటే ఎంతో ఇష్టపడే ఒసావాకు బిర్యానీ పూర్తిగా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. భారత్ నుంచి జపాన్కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఆ రుచిని మర్చిపోలేకపోయాడు. బిర్యానీ కోసం ప్రత్యేకంగా వెతుకుతూ తినడం, వివిధ రకాల బిర్యానీలను పోల్చడం మొదలుపెట్టాడు.
రెస్టారెంట్ పెట్టడం కాదు.. బిర్యానీని మాస్టర్ చేయాలనుకున్నాడు
జపాన్లో బిర్యానీకి పెద్దగా పరిచయం లేకపోవడంతో తనకు నచ్చిన రుచిని అక్కడ దొరకడం కష్టమైంది. దీంతో తానే బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టాడు. చిన్న పాప్-అప్ల నుంచి స్నేహితుల కోసం వండే స్థాయికి అతడి ప్రయాణం సాగింది. స్నేహితుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రుచిలో మార్పులు చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. అంతటితో ఆగకుండా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాలకు పదేపదే ప్రయాణించి అక్కడి బిర్యానీ తయారీ పద్ధతులను పరిశీలించాడు. పెద్ద హోటళ్ల కంటే స్థానిక రెస్టారెంట్లు, చిన్న షాపులు, స్ట్రీట్ ఫుడ్ విక్రేతల నుంచే ఎక్కువ నేర్చుకున్నానని ఒసావా చెబుతాడు.
హైదరాబాద్ నుంచి కోల్కతా వరకు.. ప్రతి ప్రాంతం నుంచి ఓ పాఠం
ఒసావా బిర్యానీని ఒకే ప్రాంతానికి చెందిన వంటకంగా చూడలేదు. హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, కోచి, లక్నో, ఢిల్లీ, కోల్కతా వంటి భారతీయ నగరాలతో పాటు లాహోర్, కరాచీ, ఢాకా వంటి ప్రాంతాల్లోని బిర్యానీ రుచులను కూడా అధ్యయనం చేశాడు. ప్రతి ప్రాంతంలో మసాలాలు, బియ్యం, మాంసం, గ్రేవీ, వంట విధానంలో ఉన్న తేడాలను గమనించాడు. అతడి స్వంత వెర్షన్లో హైదరాబాద్ స్టైల్ లేయరింగ్, కోల్కతా మసాలాల ప్రభావం, పాకిస్థానీ గ్రేవీ విధానం, బలూచిస్తాన్ పద్ధతిలో మాంసాన్ని మెత్తగా చేసే టెక్నిక్ వంటి అంశాలను కలిపినట్లు ఒసావా వివరించాడు.
అయితే అతడి దృష్టిలో బిర్యానీలో అన్నింటికంటే ముఖ్యమైనది అరోమా. బాస్మతి బియ్యం వాసన, మసాలాల సువాసన, మాంసం నుంచి వచ్చే ఉమామి కలిసి చివరి ప్లేట్ను నిర్ణయిస్తాయని అతడు భావిస్తాడు.
బిర్యానీ తింటూ ఫ్లైట్ కూడా మిస్!
బిర్యానీపై ఒసావాకు ఉన్న ప్రేమ ఎంత తీవ్రమో చెప్పడానికి అతడి ప్రయాణాల్లో జరిగిన ఓ సంఘటన చాలు. ఇటీవల ఢిల్లీలో ట్రాన్సిట్ సమయంలో మహిపాల్పూర్లో లోకల్ బిర్యానీ తినడానికి వెళ్లాడు. ఆ రుచిలో అంతగా మునిగిపోయాడట.. చివరకు తన కనెక్టింగ్ ఫ్లైట్నే మిస్ చేసుకున్నాడు. ఇలాంటి అనుభవాలే అతడిని మరింత లోతుగా బిర్యానీని అధ్యయనం చేసేలా చేశాయి.
జపాన్లో 10 సీట్లతో బిర్యానీ సామ్రాజ్యం
2021 ఆగస్టులో టోక్యోలోని కాండా ప్రాంతంలో Biryani Osawa పేరుతో తన రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఈ రెస్టారెంట్లో కేవలం 10 కౌంటర్ సీట్లు మాత్రమే ఉంటాయి. అంతేకాదు, బిర్యానీ తప్ప మరో ప్రత్యేకమైన వంటకం మెనూలో ఉండదు. ఇక్కడ మటన్ బిర్యానీ ప్రధాన వంటకం. కొన్ని రోజుల్లో చికెన్ బిర్యానీతో పాటు సీజనల్గా ఇతర ప్రత్యేక బిర్యానీ వెర్షన్లను కూడా అందిస్తారు. బిర్యానీని ముందుగానే పెద్ద మొత్తంలో తయారు చేసి ఉంచడం కంటే, కస్టమర్లు కూర్చున్న సమయానికి సరైన స్థాయిలో వండటానికే ఒసావా ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే రెస్టారెంట్కు రిజర్వేషన్ అవసరం. ప్రస్తుతం అక్కడి టేబుల్స్ చాలా వేగంగా నిండిపోతున్నాయని మిచెలిన్ గైడ్ కూడా పేర్కొంది.
ఒక్క వంటకంపైనే ఎందుకు ఇంత ఫోకస్?
జపాన్లో ఒకే కళను లేదా ఒకే వృత్తిని జీవితాంతం సాధన చేస్తూ పరిపూర్ణత సాధించే సంస్కృతి తన ఆలోచనలను ప్రభావితం చేసిందని ఒసావా వివరిస్తాడు. సుషీ చెఫ్లు సంవత్సరాల తరబడి కేవలం బియ్యం, చేపల ఎంపిక, కట్టింగ్, ప్రెజెంటేషన్ వంటి అంశాలపైనే సాధన చేయడం నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెబుతాడు.
అతడి ఫిలాసఫీ చాలా సింపుల్ — ఎక్కువ వంటకాలు నేర్చుకోవడం కంటే, ఒక్క వంటకాన్ని మరింత మెరుగ్గా చేయడంపై సంవత్సరాలు ఖర్చు చేయడం. అందుకే ఇప్పటికీ తనను తాను బిర్యానీ మాస్టర్గా భావించకుండా, ఆ వంటకం దగ్గర ఇంకా నేర్చుకుంటున్న వ్యక్తిగానే చూస్తాడు.
భారతీయులే తనకు అసలైన జడ్జీలు!
బిర్యానీ విషయంలో భారతీయుల అభిప్రాయాన్ని ఒసావా చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే బిర్యానీ రుచిని చిన్నప్పటి నుంచే ఆస్వాదించిన భారతీయులకు మసాలా, బియ్యం, మాంసం, అరోమా, టెక్స్చర్లోని చిన్న తేడాలు కూడా సులభంగా తెలిసిపోతాయని అతడి అభిప్రాయం. కస్టమర్ తన బిర్యానీని పూర్తిగా తినకుండా వదిలేస్తే నిరాశ చెందడం కంటే, అందులో ఏం తప్పు జరిగిందో తెలుసుకోవడానికి దానిని ఫీడ్బ్యాక్గా తీసుకుంటాడు. తన రిసిపీని ప్రతిరోజూ కొంచెం మెరుగ్గా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
2026లో మిచెలిన్ బిబ్ గౌర్మాండ్ గుర్తింపు
ఒసావా కష్టానికి 2026లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అతడి టోక్యో రెస్టారెంట్ Michelin Bib Gourmandలో చోటు సంపాదించింది. నాణ్యమైన ఆహారాన్ని అందించే, మంచి విలువను అందించే రెస్టారెంట్లకు ఈ గుర్తింపు ఇస్తారు. ఇక 2026లోనే ఒసావా పేరు భారత్లోనూ మరింత వైరల్ అయింది. హైదరాబాద్లో నటుడు రామ్ చరణ్ కుటుంబం కోసం బిర్యానీ వండినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ముంబైలో కూడా అతడి బిర్యానీకి సంబంధించిన పాప్-అప్ కార్యక్రమం జరిగింది.
బిర్యానీ అతడికి కేవలం ఫుడ్ కాదు.. జీవితాంతం చేసే ప్రయోగం!
జపాన్లో పుట్టిన ఒక వ్యక్తి భారతీయ వంటకం అయిన బిర్యానీని జీవిత లక్ష్యంగా మార్చుకోవడం నిజంగా ఆసక్తికరమైన కథ. కానీ ఒసావా ప్రయాణంలో ప్రత్యేకత కేవలం బిర్యానీని ప్రేమించడంలో లేదు. ఒకే పనిని పదేపదే చేస్తూ, ప్రతి తప్పు నుంచి నేర్చుకుని, నిన్నటి కంటే ఈరోజు కొంచెం మెరుగ్గా చేయాలనే ఆలోచనలో ఉంది.
అందుకే టోక్యోలోని ఆ చిన్న 10 సీట్ల రెస్టారెంట్లో వడ్డించే ప్రతి బిర్యానీ వెనుక ఒక ప్లేట్ రుచి మాత్రమే కాదు.. 15 ఏళ్ల ప్రయాణం, వేలాది ప్రయోగాలు, ఎన్నో నగరాల రుచులు, నిరంతర సాధన దాగి ఉన్నాయి.
Read also: World Biryani Day 2026: ప్రపంచ బిర్యానీ దినోత్సవం.. హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎందుకంత ప్రత్యేక గుర్తింపు?
Hyderabad Biryani : 2025లోనూ ‘బిర్యానీ క్యాపిటల్’ హైదరాబాద్.. స్విగ్గీ రిపోర్ట్లో రికార్డుల మోత
Indian style Biryani: ఇండియన్ స్టైల్ చికెన్ ఫ్రై బిర్యానీ.. తప్పక ట్రై చేయండి!






