కారు డ్రైవర్గా పని చేస్తూ దొంగతనాల బాట
హైదరాబాద్ బీ జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన పట్నంశెట్టి రాజు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో క్రమంగా దొంగతనాల వైపు మళ్లినట్లు పోలీసులు తెలిపారు. రాజు నేర చరిత్ర 2009 నుంచే మొదలైనట్లు తెలుస్తోంది. ఆ ఏడాది సైకిల్ చోరీ కేసులో జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన పంథాను మార్చుకోలేదు. 2015, 2016 సంవత్సరాల్లో జగద్గిరిగుట్ట పరిధిలో తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లోనూ జైలుకు వెళ్లి వచ్చాడు.
అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రాంతాన్ని మార్చాడు.. దొంగతనం చేసే విధానాన్ని మార్చాడు.. కానీ దొంగతనాలను మాత్రం మాత్రం మానుకోలేదు.
ఈ దొంగకు తనకంటూ కొన్ని రూల్స్!
రాజు దొంగతనాల వ్యవహారంలో ఆసక్తికరమైన విషయం అతను పెట్టుకున్న రూల్స్ అని పోలీసులు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత కనిపించిన ప్రతిదీ తీసుకెళ్లడం అతని ఉద్దేశం కాదు.
తనకు అవసరమైనంత నగదు, బంగారం, వెండి మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి విలువైన వస్తువులు కనిపించినా వాటిని అక్కడే వదిలేయాలి అనేది అతని పద్ధతిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అంతేకాదు.. దొంగతనం చేసిన సమయంలో తన వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లు పోలీసులకు దొరకకుండా కూడా జాగ్రత్తలు తీసుకునేవాడు.
కారును దూరంగా పార్క్ చేసి.. సాక్సులతో చోరీలు
కారు డ్రైవర్గా పనిచేసే రాజు సమయం దొరికినప్పుడల్లా కోదాడకు వచ్చేవాడు. తన కారును జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతంలో పార్క్ చేసేవాడు. అనంతరం స్క్రూ డ్రైవర్ తీసుకుని బయల్దేరేవాడు.
తాళం వేసి ఉండి.. ఇంట్లో ఎవరూ లేని ఇళ్లను ముందుగా గుర్తించేవాడు. చోరీ సమయంలో కాళ్లు, చేతులకు సాక్సులు వేసుకుని ఆనవాళ్లు మిగలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత తన అవసరాలకు సరిపడే నగదు, బంగారం, వెండి మాత్రమే తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. మిగిలిన విలువైన వస్తువులు ఉన్నా వాటిని ముట్టుకోకపోవడం అతని చోరీల తీరులో ప్రత్యేకంగా కనిపించిన అంశంగా పోలీసులు పేర్కొన్నారు.
కోదాడలో 10 ఇళ్లే టార్గెట్.. చివరికి ఇలా చిక్కాడు
ఇలా ఇప్పటివరకు కోదాడ ప్రాంతంలో 10 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. తాజాగా చోరీ చేసిన బంగారాన్ని విజయవాడలో విక్రయించేందుకు కారులో బయల్దేరాడు.
అయితే కోదాడలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను గమనించిన రాజు.. తన కారును మళ్లించే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.
అనంతరం రాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో వరుస చోరీల వ్యవహారం బయటపడింది.
10 తులాల బంగారం.. 47 తులాల వెండి.. రూ.3.60 లక్షల నగదు
నిందితుడు రాజు నుంచి పోలీసులు భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు:
- 10 తులాల బంగారం
- 47 తులాల వెండి
- రూ.3.60 లక్షల నగదు
చోరీలపై విచారణ కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
17 ఏళ్లుగా నేరాల బాట.. చివరకు పోలీసులకు చిక్కిన వైనం
2009లో సైకిల్ చోరీతో మొదలైన రాజు నేర చరిత్ర.. ఆ తర్వాత ఇళ్లలో చోరీలకు దారితీసింది. మధ్యలో జైలుకు వెళ్లి వచ్చినా అతని తీరు మారలేదు. ప్రాంతాలు మారుస్తూ, పద్ధతులు మార్చుకుంటూ చోరీలు కొనసాగించాడు.
తనకంటూ రూల్స్ పెట్టుకున్నప్పటికీ.. చట్టం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. చివరకు పోలీసుల వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పట్టుబడి.. వరుస దొంగతనాల గుట్టు మొత్తం బయటపడింది. ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read also: Vizianagaram Crime: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హంతకుడిగా మారాడా? సంధ్య మృతి కేసులో షాకింగ్ నిజాలు
OTT Crime Thriller: థియేటర్లలో ఓ మోస్తరు హిట్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్.. IMDbలో 8.4 రేటింగ్తో దూసుకుపోతున్న తెలుగు సినిమా ఇదే!
Khammam crime: పిల్లి అడ్డొచ్చిందని సడన్ బ్రేక్.. బోల్తా పడిన ఆటో, 10 మంది మహిళా కూలీలకు గాయాలు






