YS Jagan Tweet: ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ ట్వీట్లో జగన్ ఏమని పేర్కొన్నారంటే..
”ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు, కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు.
ఒక నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది.
ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే ఈకేసు దర్యాప్తులో పోలీసులు తమ చురుకైన స్పందనను చూపించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. చివరకు ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు.
ఇవాళ మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. పలుమార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంతవరకూ స్పందించలేదు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒక్కటే “మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు”అని. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు, రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే.” అని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: YS Jagan: నియోజకవర్గాల పెంపుపై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్.. సీట్ల పెంపు, మహిళలకు రిజర్వేషన్లపై..
YS Jagan on Putta Mahesh: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
YS Jagan Press meet: రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక విధ్వంసం.. ‘కాగ్’ నివేదిక కూడా తేల్చిన నిజం: జగన్ ధ్వజం
