Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి నాణ్యత అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడుతూ 2014–2019 మధ్య లడ్డూ సువాసన కోసం ప్రత్యేకంగా నెయ్యిని కొనుగోలు చేశారని తెలిపారు. జగన్ హయాంలో నెయ్యి నాణ్యత పరీక్షల కోసం టిటిడి ఆధునిక ల్యాబ్ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
2019–2024 మధ్య లడ్డూ నాణ్యతపై భక్తులు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని, పోటులో పనిచేసే కార్మికులే కొన్ని సమస్యలను ప్రస్తావించారని చెప్పారు. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెయిరీలకు టెండర్ ఇవ్వకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ, దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందాపూర్ డెయిరీకి టెండర్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇందాపూర్ నెయ్యి మార్కెట్ ధర కిలో రూ.529 ఉంటే, టిటిడీకి రూ.650కి సరఫరా చేసి దేవుడి సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు.
దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, లడ్డూ కల్తీ అంశంపై చర్చించకుండా సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో టిటిడీలో జరిగిన తప్పులపై గత ఐదేళ్లలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అన్నది వైఎస్సార్సీపీ స్పష్టం చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. రూ.19 కోట్ల హవాలా డబ్బు తిరుపతికి వచ్చినట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇవీ చదవండి: Tirumala Laddu : లడ్డు రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి దిశగా పయనించాలి.. పౌర సంస్థల చర్చా గోష్టిలో వక్తల ఏకగ్రీవ తీర్మానం
AP Council: ఏపీ శాసనమండలిలో లడ్డూ ప్రసాదం వివాదం… అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం
