CBN on BJP Alliance: బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల (CBN on BJP Alliance) తనకు తృప్తి, ఆనందం కలిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన.. తన నివాసం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్, హర్యానాలో బీజేపీ గెలుపు, ఈవీఎంలు, వైయస్సార్ సీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యాంశాలు ఇవీ..
’’బీజేపీ పనిచేసిన విధానం అగ్రనాయకత్వం చూపిన చొరవ వలన ఈరోజు బ్రహ్మండమైన విజయం సాధ్యమైంది. ఈరోజు ఉదయం కూడా ఫోన్లో అభినందనలు తెలిపాను. ఇది ఎన్డీఏకు మంచి బూస్ట్. మంచి పనులు, సుపరిపాలన చేస్తే ఏ విధంగా మెజారిటీ పెరుగుతుందో తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమానికి ఓటేసిన హర్యానా ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కశ్మీర్లోనూ బలమైన శక్తిగా బీజేపీ అవతరించింది.
ఏటా ఎక్కడోసారి ఎన్నికలు రావడం వలన అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదానికి అన్ని పార్టీలు సహకరించాలి. ఎప్పుడూ ఎక్కడోచోట ఎన్నికలు నిర్వహించుకోవడం, ఎక్కడన్నా ఓడిపోతే పాపులారిటీ తగ్గిపోయిందని ప్రచారం చేసుకోవడం సరికాదు. ఇవి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చిన మొదటి ఎన్నికలు.. రేపు రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి.
నరేంద్ర మోడీ కారణంగా భారతీయులంతా గర్వపడుతున్నారు. ప్రపంచంలో భారతదేశం గౌరవం పెరిగింది. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది, ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో 3వ స్థానంలోకి వస్తుంది. వికసిత్ భారత్ 2047 నినాదంతో ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలోకి వస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. డెమోగ్రఫిక్ డివిడెంట్ మనకి కలిసొచ్చే అంశం. అన్ని దేశాలు వృద్ధాప్యంతో అల్లాడుతుంటే మనకి మాత్రం యంగ్ జనరేషన్ ఉండటం శుభపరిణామం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆరోజు చేసిన పనులు వల్ల హైదరాబాద్ అభివృద్ధితో తెలంగాణ నంబర్ వన్ ఎకానమీ కింద, హయ్యస్ట్ పర్ క్యాపిటా ఇన్ కం సాధించింది.
ఏపీ విభజన తర్వాత విభజన వల్ల జరిగిన నష్టం కన్నా, విధ్వంసకర పాలన వల్ల నష్టపోయాం. ఎవరికి ఓటేస్తే సుస్థిరమైన పాలన ఇస్తారో అర్థం చేసుకోవాలి. సుస్థిర ప్రభుత్వం ఉంటే విజన్తో సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వరుసగా 11వ ఏట మోడీ ప్రభుత్వం ఉండటం కారణంగా పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజ్.. 7 శాతం గ్రోత్ రేట్ సాధించారు. ప్రపంచం మొత్తం గుర్తించింది. టెక్నాలజీ, ఇన్ఫ్రా ప్రాజెక్టుల మీద దృష్టిపెట్టారు. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో మార్పులు రావాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతిని కలుపుతూ త్వరలో బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఈ నాలుగు నగరాల్లో 4 కోట్ల మంది ఉంటారు. ఇలాంటి నిర్మాణాలు జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి.
విమర్శలు రాజకీయం కోసం కాకుండా ప్రజాహితం కోసం ఉండాలి. మన రాష్ట్రంలో కొంతమంది ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. ఏం చెప్పినా నమ్ముతారనే అహంభావంతో ఉంటారు. ప్రజలు బుద్ధి చెప్పినా అర్థం కాదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తృప్తి ఆనందం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా, దేశ ప్రయోజనాలను కూడా కాపాడుతున్నాం.
మోడీకి వేరే పనేం లేదు. 24 గంటలు దేశం కోసమే ఆలోచిస్తుంటారు. దేశానికి రాబోయే 20 ఏళ్లు ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీలన్నీ మెచ్యూరిటీకి వస్తున్నాయి. ఏఐ, సీసీ కెమెరాలు, డ్రోన్లు, సెల్ఫోన్లు, నాలెడ్జ్ మొత్త క్లౌడ్లోనే ఉంటుంది. ఏ దేశానికి లేనంత ఆధార్ సిస్టం మనకుంది. ఆయుష్మాన్ భారత్లో అందరి వివరాలు పెడితే దేశం యొక్క హెల్త్ ప్రొఫైల్ ఎనలైజ్ చేయొచ్చు.
బాధ్యత కలిగిన నాలాంటి నాయకుల బాధ్యత ప్రకారం నరేంద్ర మోడీ చేస్తున్న పనుల గురించి అవగాహన కలిగించాలి. దేశంలో నేనే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశా. నిజాలను నిజంగా ఒప్పుకోవాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. కల్తీ మనుషులు వీళ్లు. సోషల్ మీడియాలో ఏదో పెట్టుకుని ఆనందపడిపోతున్నారు.
ఎవరూ పసికట్టలేని విధంగా మొన్న ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. భవిష్యత్తులోనూ సుస్థిరమైన ప్రభుత్వానికి పట్టం కట్టాలి. సుస్థిరమైన ప్రభుత్వం ద్వారానే గుజరాత్ అభివృద్ధి చెందింది. నేను 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నంబర్ వన్ ఎకో సిస్టం క్రియేట్ చేశా. ఎవరూ నాశనం చేయలేదు. అలాగే అభివృద్ధి కొనసాగుతోంది. ఐదేళ్లలో ఇక్కడ కూడా క్రియేట్ చేశా. కానీ నాశనం చేశారు.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని పోరాడాల్సిన ప్రాజెక్టు. కొన్ని అవకతవకలు, కొంతమంది రాంగ్ ప్రయారిటీ , మిస్ మేనేజ్మెంట్, కొన్ని కారణాల వల్ల, ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దాన్ని ఏవిధంగా చేయగలమో రాష్ట్రం, కేంద్రం, విశాఖ స్టీల్ ప్రాజెక్టు కలిసి నిర్ణయిస్తాం.. షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్లో ఎలా చేయాలో చేస్తాం.
ఐదేళ్లు అధికారమిస్తే అడ్రస్ లేకుండా పోయి, ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదు. విశాఖ జోన్కు ల్యాండ్ అడిగినా ఇవ్వలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. రూ.10.50 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఆఖరుకి మద్యం మీద కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎక్కడెక్కడ ఎంతెంత అప్పు తెచ్చారో తెలియని పరిస్థితి. దోచుకోగలిగింది దోచుకున్నారు. ఆదాయ వనరుల్ని విధ్వంసం చేశారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెడుతున్నాం. 110 రోజుల్లోనే చాలా సెట్ చేశాం. ఇంకా సెట్ చేస్తాం..
చెత్త మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలి. 2019లో ప్రజాభిప్రాయం ప్రకారం ఫలితాలు వచ్చాయా.. ఇళ్ల మీద, ఆఫీసుల మీద దాడులు చేస్తే కేసులు పెట్టకూడదా..? పది రోజులు విజయవాడ వరదల్లో తిరిగా.. సాధారణ పరిస్థితి వచ్చే వరకు కృషి చేశా. వరద సాయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Read also: CBN on Liquor Syndicate: లిక్కర్ సిండికేట్పై చంద్రబాబు ఏమన్నారంటే..
Margani Bharat on CBN: లిక్కర్, ఇసుక ఆదాయం మొత్తం కూటమి నాయకుల జేబుల్లోకే
AP Liquor Policy: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త మద్యం షాపులు
Liquor: అత్యంత కిక్కు ఇచ్చే లిక్కర్ ఏదో తెలుసా?
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ సబ్ కమిటీ
