HomeBusinessMSME Andhra Pradesh: 2023-24లో 1.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు.. 7.50 లక్షల మందికి ఉపాధి...

MSME Andhra Pradesh: 2023-24లో 1.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు.. 7.50 లక్షల మందికి ఉపాధి లక్ష్యం!

MSME Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 2023-24లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటు ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో ఉపాధి కల్పించేందకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి (AP CS Dr.KS Jawahar Reddy) వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ (MSME) రంగంపై అధికారులతో ఇవాళ సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. (MSME Andhra Pradesh)

రాష్ట్రంలో 2022-23 ఏడాదిలో 15 వేల 625 కోట్ల రూపాయల ఖర్చుతో లక్షా 25 వేల యూనిట్లు నెలకొల్పి లక్షా 56 వేల మంది యువతకు ఉపాధి కల్పించాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ రూ.9,677 కోట్ల ఖర్చుతో అంటే 62 శాతం లక్ష్య సాధన పూర్తయిందన్నారు. 92,707 యూనిట్లను 75 శాతం లక్ష్య సాధనతో 3 లక్షల 61 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఉపాధి కల్పనలో 231 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు సీఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకునేలా కలెక్టర్లతో మాట్లాడాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌కు సీఎస్ సూచించారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న వివిధ యూనిట్లను వచ్చే అక్టోబర్‌ 2వ తేదీన ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ యూనిట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఒక జిల్లా ఒక ప్రాడక్టు అనే విధానం కింద ప్రతి జిల్లా నుంచి కనీసం రెండు మూడు ఉత్పత్తులను గుర్తించి ఆప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పరిశ్రమల శాఖ, చేనేత జౌళి శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఇంకా ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి పలు అంశాలను ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆయా అధికారులతో సమీక్షించారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కె.ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగంలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 69 వేల 338 కోట్ల వ్యయంతో 3 లక్షల 94 వేల వివిధ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పామన్నారు. తద్వారా 34 లక్షల 84 వేల మందికి ఈ రంగంలో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద వివిధ యూనిట్లు ఏర్పాటుకు 46 ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు అందాయని వివరించారు.

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమం కింద 2022-23లో 6750 యూనిట్లు నెలకొల్పాల్సి ఉండగా 3069 యూనిట్లు నెలకొల్పి 25 వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి లో భాగంగా ప్రాధమికంగా విశాఖ, కాకినాడ, గుంటూరు మూడు జిల్లాల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు కమిషనర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ చేనేత జౌళి శాఖ కు సంబంధించి ఒక జిల్లా ఒక ఉత్పత్తికి కింద రాష్ట్రంలో 35 రకాల ఉత్పత్తులను గుర్తించామని చెప్పారు.

Read Also : Central Cabinet Changes: కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. బండి సంజయ్‌కి స్థానం?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు