గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారానికి కేంద్రం లెక్కల చెక్‌!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 21 జూలై 2026

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, భారీ సంఖ్యలో పరిశ్రమలు స్థాపన దశలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన అధికారిక గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. వైయస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

గత రెండేళ్లలో డీపీఐఐటీ (DPIIT), ఇన్వెస్ట్ ఇండియా పర్యవేక్షించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. వాటిలో రెండు ప్రాజెక్టుల తయారీ యూనిట్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని, మిగిలిన ఎనిమిది ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులకు రూ.6,962 కోట్ల అంచనా పెట్టుబడి ఉండగా, సుమారు 22,167 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇవి ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు లేదా కల్పించిన ఉద్యోగాలు కావని, అంచనా గణాంకాలేనని కేంద్ర సమాధానంలో స్పష్టమైంది.

రూ.6,962 కోట్ల పెట్టుబడి కూడా అంచనానే.. ఉద్యోగాలు కూడా భవిష్యత్ లక్ష్యమే

కేంద్ర సమాధానంలో ఒక కీలక అంశం ఏమిటంటే.. రూ.6,962 కోట్ల పెట్టుబడి ఇప్పటివరకు పూర్తిగా వచ్చిన మొత్తం కాదని, ప్రాజెక్టుల అంచనా పెట్టుబడి (Estimated Investment) మాత్రమేనని పేర్కొంది. అలాగే 22,167 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించినవి కాకుండా, ప్రాజెక్టులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఏర్పడే అవకాశమున్న ఉద్యోగాలుగా వివరించింది. ఇప్పటివరకు వాస్తవంగా ఎంత పెట్టుబడి రాష్ట్రంలోకి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి? ప్రస్తుతం ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? వంటి కీలక అంశాలపై కేంద్రం ఎలాంటి సంఖ్యలను వెల్లడించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల గణాంకాలు వాస్తవ పెట్టుబడులా? లేక ప్రతిపాదనల ఆధారంగా చేస్తున్న ప్రచారమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేంద్రం చెప్పిన అభివృద్ధి ప్రాజెక్టులు.. పారిశ్రామిక కారిడార్లు నుంచి డ్రోన్ సిటీ వరకు

లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పలు పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రస్తావించింది. కృష్ణపట్నం, ఓర్వకల్, కొప్పర్తి ప్రాంతాల్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. అలాగే బల్క్ డ్రగ్ పార్క్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు (EMC 2.0), నంద్యాలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), సాగర్‌మాల పథకం కింద పోర్టు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో 300 ఎకరాల్లో దేశంలోని తొలి డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంటూ, దీని ద్వారా భవిష్యత్తులో 40 వేలకుపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇవన్నీ కొనసాగుతున్న లేదా ప్రణాళిక దశలో ఉన్న ప్రాజెక్టులేనని కేంద్రం వివరించింది.

ఎంఎస్‌ఎంఈలపై కేంద్ర సమాధానం.. శిక్షణ పొందినవారే ఎక్కువ

స్థానిక పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాలపై కూడా కేంద్రం వివరాలు ఇచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ESDP) కింద 2024–25లో 201 కార్యక్రమాల ద్వారా 10,093 మంది, 2025–26లో 625 కార్యక్రమాల ద్వారా 32,428 మంది శిక్షణ పొందినట్లు వెల్లడించింది. అయితే ఈ శిక్షణ పొందిన వారిలో ఎంతమంది కొత్త పరిశ్రమలు ప్రారంభించారు? ఎంతమందికి రుణాలు లేదా ఆర్థిక సహాయం లభించింది? ఎన్ని ఎంఎస్‌ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి? వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? వంటి వివరాలు మాత్రం సమాధానంలో లేవు. దీంతో శిక్షణ పొందిన వారందరినీ పారిశ్రామికవేత్తలుగా లేదా ఉద్యోగాలు పొందిన వారిగా పరిగణించలేమనే విషయం స్పష్టమవుతోంది.

ప్రచార గణాంకాలు – అధికారిక లెక్కలు.. రెండింటి మధ్య వ్యత్యాసమా?

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం, గత రెండేళ్లలో గ్రౌండ్ అయినవి 10 ప్రాజెక్టులు మాత్రమే, అందులో పూర్తయిన పరిశ్రమల నిర్మాణాలు రెండే. మిగిలిన ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే రూ.6,962 కోట్ల పెట్టుబడి, 22,167 ఉద్యోగాలు కూడా అంచనా గణాంకాలే తప్ప ఇప్పటివరకు వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు లేదా ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కాదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడుల గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన అధికారిక వివరాల మధ్య వ్యత్యాసం ఉందన్న విమర్శలకు మరింత బలం చేకూరుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం పెట్టుబడుల వాస్తవ స్థితి, పరిశ్రమల పురోగతి, ఉద్యోగాల కల్పనపై మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆధారం: 1573875013

ఇవీ చ‌ద‌వండి: Andhra Pradesh: వానలు పడాలంటే గ్రామదేవతలే కాపాడాలని నమ్మకం.. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి జలాభిషేకాలు..
Andhra Pradesh: పొగాకు రైతుల సంక్షోభం మరింత తీవ్రం.. రెండేళ్లలో రూ.3,284 కోట్ల నష్టం: MVS
Andhra Pradesh: ఏపీ విమానాశ్రయాల్లో 24 గంటల మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్.. తిరుపతికి మినహాయింపు.. కొత్త ఎక్సైజ్ విధానం పూర్తి వివరాలు

ట్యాగ్స్: , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading