YS Jagan on Veligonda: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెలిగొండ ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్గా మారింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం, జంట సొరంగాల పూర్తి, ప్రస్తుతం కృష్ణా జలాల తరలింపుపై జరుగుతున్న రాజకీయ ప్రచారంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టు క్రెడిట్పై చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని తప్పుబడుతూ ఆయన సుదీర్ఘ ట్వీట్ చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం సంతోషంగా ఉందని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాల నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేశామని, ప్రస్తుతం ఆ సొరంగాల ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం సంతృప్తినిస్తోందని తెలిపారు.
ఫ్లోరైడ్ బాధితులకు, రైతులకు వెలిగొండ సంజీవని: జగన్
రక్షిత మంచినీటి సౌకర్యం లేక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఎంతో కీలకమని వైఎస్ జగన్ అన్నారు. అయితే, ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న హడావిడి మొత్తం ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను మార్చే ప్రయత్నంగా కనిపిస్తోందని ఆరోపించారు.
శిలాఫలకం మీది.. సంకల్పం వైయస్సార్ది
వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర చాలా స్పష్టంగా ఉందని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. శిలాఫలకానికి సంబంధించిన ఘనత చంద్రబాబుదే కావొచ్చని, కానీ ప్రాజెక్టుకు సమగ్ర రూపకల్పన చేసి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత వైఎస్సార్కు చెందుతుందని అన్నారు. కీలకమైన జంట సొరంగాలను పూర్తిచేసింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు నిర్మాణ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేశారు.
1996 శంకుస్థాపన నుంచి 2004 వరకు ఏం జరిగింది?
వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారని జగన్ గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత 2004 వరకు ఎనిమిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టును గణనీయంగా ముందుకు తీసుకెళ్లలేదని చంద్రబాబుపై ఆరోపించారు. ఆ ఎనిమిదేళ్ల కాలంలో వెలిగొండ కోసం ఖర్చు చేసిన మొత్తం కేవలం రూ.10 లక్షలేనని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ఖర్చు కూడా ప్రధానంగా శంకుస్థాపన, సభల ఏర్పాట్లకే పరిమితమైందని ఆరోపించారు.
వైఎస్సార్ హయాంలో వెలిగొండకు సమగ్ర రూపం
2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు సమగ్ర రూపం ఇచ్చారని జగన్ తెలిపారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణం వంటి కీలక పనులను చేపట్టి ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించడంలో అత్యంత కీలకమైన భాగం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలని జగన్ వివరించారు. ఈ సొరంగాలు లేకుండా ప్రాజెక్టు లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
జంట సొరంగాల నిర్మాణంపై జగన్ లెక్కలు
వెలిగొండ జంట సొరంగాల నిర్మాణానికి సంబంధించిన వివరాలను కూడా జగన్ తన ట్వీట్లో ప్రస్తావించారు. వైఎస్సార్ ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్ల సొరంగాల పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం 6.686 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో కరోనా మహమ్మారి, ఆర్థిక ఇబ్బందులు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల సొరంగాల తవ్వకాన్ని పూర్తిచేశామని తెలిపారు. టన్నెల్-1ను 2021 జనవరిలో, టన్నెల్-2ను 2024 జనవరిలో పూర్తి చేశామని, 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశామని జగన్ పేర్కొన్నారు. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనుల ద్వారా నీటి తరలింపునకు అవసరమైన ఏర్పాట్లను కూడా తమ ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేశామని చెప్పారు.
జంట సొరంగాలు సిద్ధమైతే 26 నెలలు ఎందుకు ఆలస్యం?
జంట సొరంగాలు 2024లోనే సిద్ధమైనప్పటికీ, ఆ తర్వాత నిర్వాసితుల పునరావాస ప్రక్రియను పూర్తి చేయడంలో 26 నెలల ఆలస్యం ఎందుకు జరిగిందని జగన్ ప్రశ్నించారు. నల్లమలసాగర్కు నీటిని ఎందుకు త్వరగా తరలించలేకపోయారని, రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్న తర్వాత కూడా ప్రజలకు అందాల్సిన ప్రయోజనాలు ఆలస్యం కావడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై జగన్ ఆందోళన
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన పునరావాసం, పునరుద్ధరణ ప్యాకేజీ అంశాన్ని కూడా జగన్ తన ట్వీట్లో ప్రస్తావించారు. అనేక కుటుంబాలకు ఇంకా పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని ఆయన ఆరోపించారు. పునరావాసానికి సంబంధించిన బకాయిలు పూర్తిగా చెల్లించకుండానే నిర్వాసితులను గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, తాగునీటి సరఫరాకు అంతరాయం కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయని జగన్ ట్వీట్లో ప్రస్తావించారు.
పెద్దదోర్నాల ఆస్పత్రి, మార్కాపురం మెడికల్ కాలేజీపై ప్రశ్నలు
వెలిగొండ ప్రాజెక్టుతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. పెద్దదోర్నాలలో తమ ప్రభుత్వం చేపట్టిన 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఎందుకు నిలిచిపోయాయని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు రంగానికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు.
ప్రచారం కాదు.. రైతులకు నీరు ఇవ్వండి
ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ కోరారు. నల్లమలసాగర్ను పూర్తిస్థాయిలో నింపాలని, రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించడంతో పాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్పై ఇప్పుడు రాజకీయంగా మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరి పాత్ర ఎంత అన్న అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
Read also: Veligonda Rehabilitation Colony: అడిగేవాడు లేడని అందినకాడికి దోచేశారు.. వెలిగొండ కాలనీలో కరెంట్ వైర్లు మాయం!
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్ను గుర్తు చేసుకున్న సీఎం జగన్
