HomeAndhra PradeshVeligonda Rehabilitation Colony: అడిగేవాడు లేడని అందినకాడికి దోచేశారు.. వెలిగొండ కాలనీలో కరెంట్ వైర్లు మాయం!

Veligonda Rehabilitation Colony: అడిగేవాడు లేడని అందినకాడికి దోచేశారు.. వెలిగొండ కాలనీలో కరెంట్ వైర్లు మాయం!

Veligonda Rehabilitation Colony: “అడిగేవాడు లేకపోతే అందినకాడికి దోచుకెళ్ళారట”.. సరిగ్గా ఇదే సామెత ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు సుంకేసుల పునరావాస కాలనీకి వర్తిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ఆ కాలనీలో దొంగలు పక్కా ప్లాన్‌తో పడగవిప్పారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న వైర్లను కట్ చేసుకుని ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

17 విద్యుత్‌ స్తంభాలు.. తీరిగ్గా కట్ చేసి ఎత్తుకెళ్లారు!

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలో వెలిగొండ ప్రాజెక్ట్ సుంకేసుల గ్రామ పునరావాస కేంద్రాన్ని (Rehabilitation Center) ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా ఈ కాలనీ పనులు నత్తనడకన సాగుతుండటంతో అక్కడ జనసంచారం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే విద్యుత్‌ సౌకర్యం కోసం అధికారులు వేసిన లైన్లపై దొంగల కన్ను పడింది. చీకటి పడ్డాక తీరిగ్గా కరెంట్ స్థంభాలు ఎక్కి, ఒకటీ రెండు కాదు ఏకంగా 17 విద్యుత్‌ స్తంభాలకు సంబంధించిన వైర్లను కట్‌ చేసి తీసుకెళ్లారు. ఆ వైర్లను అమ్మి సొమ్ము చేసుకోవడానికే ఈ దొంగతనానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

ప్రభుత్వ భవనాల పైపైనా దాడులు!

కేవలం విద్యుత్ వైర్ల చోరీయే కాకుండా, అధికారుల పర్యవేక్షణ అసలే లేకపోవడంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. కాలనీలో ఇప్పటికే నిర్మించిన ప్రభుత్వ భవనాల తలుపులు, కిటికీలను సైతం ధ్వంసం చేస్తూ ఆస్తి నష్టం కలిగిస్తున్నారు.

రైతుల ట్రాన్స్‌ఫార్మర్లపైనా పడ్డ దొంగల కన్ను

పెద్దారవీడు మండలంలోని అనేక గ్రామాల్లో గత కొంతకాలంగా వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను (Transformers) ధ్వంసం చేసి, వాటిలోని ఖరీదైన రాగి తీగలను (Copper Wires) దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఏకంగా పునరావాస కాలనీలో స్థంభాలపై ఉన్న వైర్లను కట్ చేయడం విద్యుత్ శాఖ భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది.

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు దొంగల పాలవుతున్నా విద్యుత్ శాఖ, పునరావాస అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాలనీకి తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Read also: Punjab Crime: బ్యాంకు నుంచి రూ.15 లక్షలు తీస్తే.. క్షణాల్లో బ్యాగ్ మాయం! అమృత్‌సర్‌లో సినీ ఫక్కీలో చోరీ
Hyderabad Crime: కంటైన‌ర్ క్యాబిన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సీక్రెట్ గా ఎలా ప్లాన్ చేశారంటే..
Chittoor Crime: చిత్తూరులో దారుణం.. గుడికి తీసుకెళ్లి భర్తను హత్య చేసిన భార్య.. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు