AP Govt Shceme: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్తను ప్రకటించింది. మహిళల ఆర్థిక సాధికారత, విద్యా పురోగతిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు కీలక పథకాలను ప్రారంభించారు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ఫోన్లు అనే మూడు కొత్త కార్యక్రమాలతో మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన కుటుంబాల ఆడపిల్లల విద్య, వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశం.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి స్కీము
రాష్ట్రంలోని ఆడపిల్లల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కుటుంబాలకు చెందిన బాలికలకు ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీపై రుణ సదుపాయం కల్పించనున్నారు. ఈ పథకం కింద ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికల విద్య కోసం రూ.10 వేల నుండి రూ.1 లక్ష వరకు రుణాన్ని అందించనున్నారు. ఈ రుణంపై కేవలం పావలా వడ్డీ మాత్రమే ఉండటం ప్రత్యేకత.
అంతేకాకుండా ఈ రుణాన్ని 48 వాయిదాల్లో తిరిగి చెల్లించే సౌకర్యం కల్పించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అర్హతలు
డ్వాక్రా మహిళా సంఘంలో కనీసం 6 నెలల సభ్యత్వం ఉండాలి
కుటుంబంలో ఉన్న ఆడపిల్ల ఉన్నత విద్య కోసం ఉపయోగించాలి
ఒక కుటుంబానికి గరిష్టంగా ఇద్దరు బాలికలకు రుణం
అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
ఆదాయ ధృవీకరణ పత్రం / డొమిసైల్ సర్టిఫికెట్
స్కూల్ లేదా కాలేజ్ అడ్మిషన్ లెటర్
ఫీజు రసీదు
దరఖాస్తు విధానం
స్థానిక డ్వాక్రా సంఘం, సెర్ప్ యానిమేటర్ లేదా వెలుగు కార్యాలయం ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 48 గంటల్లో స్త్రీనిధి బ్యాంక్ ఖాతాలో రుణం జమ అవుతుంది.
ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం
ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. డ్వాక్రా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాల కోసం ఈ పథకం కింద రుణాన్ని అందించనున్నారు. ఈ పథకం ద్వారా అవసరాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం ఇవ్వనున్నారు. దీనిపై కూడా కేవలం రూ.25 పైసల వడ్డీ మాత్రమే ఉండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల వివాహాల సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
యానిమేటర్లకు ఫ్రీగా స్మార్ట్ఫోన్
డ్వాక్రా మహిళా సంఘాల నిర్వహణను డిజిటల్ విధానంలో మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల యానిమేటర్లకు రూ.15 వేల విలువైన స్మార్ట్ఫోన్లు ఉచితంగా అందించనున్నారు.
ఈ కార్యక్రమం కింద
సుమారు 27,500 మహిళా సంఘాల యానిమేటర్లకు స్మార్ట్ఫోన్లు
5000 కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు స్మార్ట్ఫోన్లు
600 మంది APMలకు ల్యాప్టాప్లు ఇవ్వనున్నారు
ఈ పరికరాల ద్వారా మహిళా సంఘాల బుక్ కీపింగ్, లావాదేవీలు, రికార్డు నిర్వహణ వంటి పనులు సులభంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ మూడు పథకాల ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక బలం చేకూర్చడమే కాకుండా, ఆడపిల్లల విద్య మరియు వివాహాల విషయంలో కుటుంబాలకు భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పథకాలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు కొత్త దిశను చూపనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవీ చదవండి: Deepam Scheme: దీపం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఆ చార్జీలు వద్దు
AP New Scheme: ఏపీలో పాడి రైతులకు గుడ్ న్యూస్.. కొత్త పథకం అమలు ఎప్పటి నుంచంటే..
Andhra Pradesh Population: జనాభా పెంపుపై కొత్త పాలసీకి శ్రీకారం… రెండో బిడ్డ నుంచి ప్రోత్సాహకాలు: చంద్రబాబు
