HomeTelanganaSIT Investigation KCR : ఫోన్ ట్యాపింగ్ కేసు: కేసీఆర్ సిట్ విచారణ 4 గంటల...

SIT Investigation KCR : ఫోన్ ట్యాపింగ్ కేసు: కేసీఆర్ సిట్ విచారణ 4 గంటల 45 నిమిషాలు… నందినగర్‌లో గట్టి బందోబస్తు

SIT Investigation KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ విచారణ నాలుగు గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు ముగిసింది.

విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేసినట్లు అధికారులు తెలిపారు. రెండో అంతస్తులోని ఒక గదిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.

విచారణ అనంతరం నేతల చేరిక
విచారణ ముగిసిందన్న సమాచారం వెలువడగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నందినగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి బాల్కనీలోకి వచ్చిన కేసీఆర్ కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చలు జరిపారు.

తరువాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కేసీఆర్, రానున్న మున్సిపల్ ఎన్నికలపై కీలక సూచనలు చేశారు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలంగా ఉందని, రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని, త్వరలో అనేక మంది బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కేసీఆర్ నందినగర్ నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారు.

కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కేసీఆర్ సిట్ విచారణపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ధీశాలి నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. చిల్లర రాజకీయాలకు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడించినట్లుగానే సిట్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చట్టప్రకారం కేసీఆర్ ఉన్న చోటే విచారణ జరగాల్సినప్పటికీ, చట్టాన్ని గౌరవిస్తూ ఆయన సిట్ విచారణకు హాజరయ్యారని తెలిపారు. ప్రజల్లో అపోహలు, అసత్యాలు సృష్టించేందుకే ఈ విచారణను నాటకంగా మార్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
ఇదిలావుంటే, కేసీఆర్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి నివాసం వైపు వెళ్లేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాటలు చోటుచేసుకోగా, మహిళా కార్యకర్తలు పలుమార్లు ఆందోళనకు దిగారు.

మొత్తంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు చట్టపరమైన విచారణ కొనసాగుతుండగా, మరోవైపు దీనిని రాజకీయ వేధింపులుగా బీఆర్‌ఎస్ నేతలు అభివర్ణించడం తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించింది.

ఇవీ చదవండి: KCR : కేసీఆర్‌కు మరోసారి నోటీసులు… ఫిబ్రవరి 1న విచారణకు హాజరు కావాలని సూచన
Phone Tapping Case : కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. విచారణ వాయిదా కోరిన మాజీ సీఎం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు