Black Tiger : తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా అడవీ ప్రాంతాల్లో మగ పులి కదలికలు కలకలం సృష్టిస్తుండగా, మరోవైపు ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్లో అరుదైన బ్లాక్ టైగర్ ట్రాప్ కెమెరాలకు చిక్కడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ రెండు పరిణామాలు పులుల సంఖ్య పెరుగుదలకు, అటవీ పర్యావరణ సమతుల్యతకు నిదర్శనంగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో పులి సంచారం
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, కొయ్యలగూడెం అటవీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా మగ పులి సంచరిస్తోంది. ఈ పులి పోలవరం అభయారణ్యం నుంచి తెలంగాణ వైపు వెళ్లి తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి కదలికలు మళ్లీ పోలవరం అభయారణ్యం దిశగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ట్రాక్ పగుళ్లు, పాదముద్రలు, కెమెరా ఫుటేజీ ఆధారంగా దాని ప్రయాణ మార్గాన్ని గుర్తిస్తున్నారు.
ఇంకా రెండు రోజుల పాటు పులి కదలికలను గమనించిన అనంతరం, పరిస్థితి పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారణకు వస్తే ఇప్పటివరకు తీసుకున్న ప్రత్యేక నిఘా చర్యలను ఉపసంహరించనున్నట్లు ఏలూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. గ్రామాల సమీపంలోకి పులి రావడం వల్ల స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లవద్దని, పశువులను అడవిలో మేతకు వదలవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
సిమిలిపాల్లో అరుదైన బ్లాక్ టైగర్
మరోవైపు ఒడిశాలోని ప్రసిద్ధ సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన బ్లాక్ టైగర్ మరోసారి దర్శనమిచ్చింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఈ నల్ల పులి స్పష్టంగా కనిపించింది. సాల్, టేకు, వెదురు చెట్లు విస్తారంగా ఉన్న ఈ అడవీ ప్రాంతం పులుల నివాసానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా సిమిలిపాల్ అడవుల్లో బ్లాక్ టైగర్స్ (Melanistic Tigers) ఎక్కువగా కనిపిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా విశేషంగా పరిగణిస్తారు.
ఎందుకు నల్లగా కనిపిస్తాయి?
బ్లాక్ టైగర్స్ సాధారణ పులుల్లాగే నారింజ రంగులోనే ఉంటాయి. అయితే వీటి శరీరంలో మెలనిజం (Melanism) అధికంగా ఉండటం వల్ల నల్లటి గీతలు ఎక్కువగా ఉండి, అవి దాదాపు పూర్తిగా నల్లగా కనిపిస్తాయి. ఈ లక్షణం ప్రపంచంలో చాలా అరుదైనది. అందుకే సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ను బ్లాక్ టైగర్స్కు ప్రత్యేక నివాసంగా పరిగణిస్తున్నారు.
సాల్ చెట్లే ప్రధాన కారణం
సిమిలిపాల్లో పులుల సంఖ్య పెరుగుదలకు అక్కడ విస్తారంగా ఉన్న సాల్ చెట్లు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లు ఎండలు, భారీ వర్షాలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు చాలా కాలం జీవిస్తాయి.
సాల్ అడవులు పులులకు అవసరమైన
దాగుకునే ప్రదేశాలు
వేటకు అనుకూల వాతావరణం
ఆహార జంతువుల సమృద్ధి కలిగిస్తాయి. అందుకే ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు ఉన్న చోట పులుల సంచారం పెరుగుతోంది.
చారిత్రక ప్రాధాన్యం
సిమిలిపాల్ అడవుల్లో తొలిసారిగా 1975–76 కాలంలో అటవీ అధికారులు, విదేశీ పర్యాటకులు నల్ల పులులను గుర్తించారు. అప్పటి నుంచి ఈ అరుదైన జాతిని ప్రత్యేకంగా పరిరక్షిస్తున్నారు. 1994లో సిమిలిపాల్ ప్రాంతాన్ని యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించారు. ఇక్కడ పులులతో పాటు చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు, అనేక అరుదైన పక్షిజాతులు నివసిస్తున్నాయి.
ప్రపంచ గుర్తింపు పొందిన ఫోటోలు
ఇటీవల జనవరి 20న హరివిజయ్ సింగ్ బహియా తన కెమెరాలో బ్లాక్ టైగర్ను బంధించారు. అంతకు ముందు నాగపూర్కు చెందిన ఫోటోగ్రాఫర్ ప్రసేన్ జిత్ యాదవ్ తీసిన నల్ల పులి చిత్రాలు ‘నేషనల్ జియోగ్రాఫిక్ 2025 అక్టోబర్ ఎడిషన్’ కవర్ ఫోటోగా ప్రచురితమయ్యాయి.
ఇది సిమిలిపాల్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది.
రాష్ట్రపతి పర్యటన.. పర్యాటకులకు నిషేధం
ఇక ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సిమిలిపాల్ నేషనల్ పార్క్ను సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మూడు రోజుల పాటు పర్యాటకులను పార్క్లోకి అనుమతించబోమని అటవీ శాఖ ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లతో పాటు వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పర్యావరణ సమతుల్యతకు సంకేతం
పులుల సంఖ్య పెరగడం అటవీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే సూచనగా నిపుణులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో పులి సంచారం, సిమిలిపాల్లో బ్లాక్ టైగర్ దర్శనం — రెండూ భారతదేశంలో వన్యప్రాణి పరిరక్షణ ఫలితాలను సూచిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: International Tiger Day : అంతర్జాతీయ పులుల దినోత్సవం.. బెబ్బులి పవర్!
Watch Video: తన బోనులోకి చొరబడ్డ పాముతో హోరాహోరీ… ఐదు రోజుల పోరాటం తర్వాత సింహం మృతి
Largest Residential Building : ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్.. ఒకేచోట 20 వేల మందికిపైగా నివాసం!
