Cyclone Montha : ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విరుచుకుపడిన మొంథా తుపాను భారీ స్థాయిలో ఆస్తినష్టాన్ని మిగిల్చిందని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారు కలిసి తుఫాను నష్టాలపై వివరించిన నివేదికను అందజేశారు.
తుపాన్ ప్రభావం తీవ్రం – 3,109 గ్రామాలు దెబ్బ
అక్టోబర్ 28న రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటిన మొంథా తుఫాను సమయంలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు, అతి భారీ వర్షాలు కురవడంతో మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని మంత్రులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ తక్షణ చర్యలు
తుఫాను దాటిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై:
1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించడం
వారికి ఆహారం, పాలు, తాగునీరు, అవసరమైన వస్తువుల సరఫరా
ప్రతి ప్రభావిత కుటుంబానికి ₹3,000 తక్షణ సాయం
చెట్లు తొలగింపు, తాత్కాలిక వసతి, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టింది
తక్షణ సహాయం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ₹60 కోట్లు విడుదల చేశారు.
రంగాల వారీగా వచ్చిన నష్టం
వ్యవసాయం & అనుబంధ రంగాలు: ₹271 కోట్లు
గృహ నష్టం: ₹7 కోట్లు
రహదారులు & మౌలిక సదుపాయాలు: ₹4,324 కోట్లు
విద్యుత్ శాఖ: ₹41 కోట్లు
నీటివనరులు & నీటిపారుదల: ₹369 కోట్లు
శాశ్వత నిర్మాణాలు: ₹1,302 కోట్లు
సామూహిక ఆస్తులు: ₹48 కోట్లు
మొత్తం నష్టం ₹6,352 కోట్లు కాగా, NDRF మార్గదర్శకాల ప్రకారం ₹902 కోట్లు తక్షణ ఉపశమనానికి అర్హమని నివేదిక పేర్కొంది.
కేంద్ర జట్టు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయింది
ఈ నెల 12న సమర్పించిన నివేదిక ఆధారంగా IMCT (Inter-Ministerial Central Team) ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలను పరిశీలించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
అమిత్ షాను కలిసిన వారిలో హోంమంత్రి అనితతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.
ఇవీ చదవండి: Andhra Pradesh : మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
AP Mandous Cyclone: తుపానుతో దెబ్బతిన్న పంటలు, ధాన్యం కొనుగోలుపై సీఎం కీలక ఆదేశాలు
