MLC Kavitha : సొంత కూతరు, ఎమ్మెల్సీ కవితను మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో భారత రాష్ట్ర సమితిలో ప్రజాస్వామ్యం ఉండదనే విషయాన్ని మరోసారి రుజువు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో జరగుతున్న వ్యవహారాలతో విభేదించి గొంతెత్తే వారిపై వేటు వేయడం ఆ పార్టీకి కొత్తేంకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (MLC Kavitha)
అమెరికా నుంచి తిరిగి వచ్చాక సోమవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత అవినీతి ఆరోపణలు చేయడం తెలిసిందే. మాజీ మంత్రి హరీష్రావు, మాజీ ఎంపీ సంతోష్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వీరి అవినీతి, అక్రమాల కారణంగానే కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా ఆరోపణలు చేసిన 24 గంటల్లోపే కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేయడం బీఆర్ఎస్లోని నియంతృత్వ పోకడలను మరోసారి రుజువు చేస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అవినీతిలో భాగస్వామ్యమైన నేతలను పార్టీ రక్షించుకుంటోందని, ఈ వ్యవహారాలపై గొంతెత్తే వారిపై వేటు తప్పదనే విషయాన్ని ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ ద్వారా మరోసారి పార్టీ నేతలకు సందేశమిచ్చిందనే వాదన వినిపిస్తోంది. గతంలో ఇదే మాదిరిగా ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ఎందరో రాజకీయ నేతలను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది.
ప్రజాస్వామ్యం ఉన్న రాజకీయ పార్టీల్లో సహజంగానే ఎవరైనా పార్టీ వైఖరికి భిన్నంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ కమిటీ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. సదరు నేతలు ఆ నోటీసులకు జావాబు ఇచ్చేంత వరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోదు. వేచిచూసే ధోరణి అవలంబిస్తుంది. పార్టీ వైఖరికి భిన్నంగా ప్రవర్తించడానికి దారి తీసిన పరిస్థితులపై సదరు నేతలు చెప్పుకొనే అవకాశాలు ఉంటాయి.
నోటీసులపై సమాధానాలను పరిశీలించిన తరువాతే అలాంటి నేతలపై తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ, మాటల్లో – చేతల్లో నియంతృత్వ పోకడులు, ప్రజలంటే లెక్కలేనితనంతో ప్రవర్తించే బీఆర్ఎస్లో ఇలాంటి సంప్రదాయం ఏ కోశానా కనిపించదు. పార్టీ వ్యవహారాలపై తమ గొంతెత్తిన 24 గంటల్లోపు అలాంటి నేతలపై వేటు వేసే సంప్రదాయం ఒక్క బీఆర్ఎస్లో మాత్రమే కనిపిస్తోంది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం సభ జరిగిన తీరుపై, బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై కవిత చేసిన వ్యాఖ్యలతో పార్టీలో నెలకొన్న లుకలుకలు బహిర్గతం అయ్యాయి. తాను జైలులో ఉండగా బీఆర్ఎస్-బీజేపీ విలీన ప్రతిపాదనలు వస్తే తానే అడ్డుకున్నానని, పదవికి రాజీనామా చేసైనా జైలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్తో చెప్పినట్టు కవిత వ్యాఖ్యానించారు. దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్-బీజేపీలు రహస్య పొత్తులో ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. కవిత వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీలు ఏదో ఒకరోజు కలుస్తాయనే ప్రచారం జోరందుకుంది.
మరోవైపు కాళేశ్వరం నిర్మాణంలో మాజీ మంత్రి హరీష్రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులు అవినీతి ఆనకొండలని కవిత ఆరోపించారు. ఈ ఇద్దరి వల్లే కేసీఆర్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కేసీఆర్ సొంత కూతురు నిర్ధారించడం వాస్తవాలకు బలం చేకూర్చినట్టైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏదిఏమైనా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఏకైక కారణంతో, కనీసం షోకాజ్ నోటీసులు కూడా అందుకోకుండా సస్పెన్షన్కు గురైన బీఆర్ఎస్ నేతల జాబితాలో కవిత కూడా ఈ రోజు చేరిపోయారు.
ఇవీ చదవండి: Kavitha Suspended: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కవిత సస్పెండ్!
MLC Kavitha : హరీష్రావు, సంతోష్ల వల్లే.. కవిత సంచలనం
Keleswaram : బీజేపీపై తీవ్ర ఒత్తిడి: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు అంగీకరించాల్సిందేనా?
Rajiv Yuva Vikasam : ఒక్క పథకంతో 5 లక్షల మంది యువ వ్యాపారవేత్తలు
