Rajiv Yuva Vikasam : ఎన్నో వ్యాపార ఆలోచనలు ఉండి పెట్టుబడి సాయం లేక వెనుకబడిన లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులకు అండగా నిలిచేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.
ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువతి, యువకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 16.22 లక్షల మంది తమ వ్యాపార ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు సబ్సీడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాదికి 5 లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. దీని కోసం రూ.6,250 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ 2న రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 50 వేల వరకు 100%, రూ. లక్ష వరకు 90%, రూ.2 లక్షల వరకు 80%, రూ.4 లక్షల వరకు 70% సబ్సీడీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు.
జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందిచనున్నారు. అలాగే జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. లబ్ధిదారులు ఎంచుకున్న రంగంలో వారికి నైపుణ్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వంతో ఎంప్యానల్ చేసుకున్న సంస్థలు ఎంట్రప్రెన్యూరియల్షిప్ డెవలెప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ జయంతి నాటికి యూనిట్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
22 లక్షల ఉద్యోగాల లక్ష్యం!
రాజీవ్ యువ వికాసం కింద లబ్ధిపొందనున్న 5 లక్షల మంది నిరుద్యోగులు ఎంఎస్ఎంఈ రంగంలో విభిన్న వ్యాపారాలను ప్రారంభించనున్నారు. తద్వారా మున్ముందు తెలంగాణలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆల్ ఇండియా సెన్సెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ నాలుగవ నివేదిక ప్రకారం.. దేశంలో ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ సగటున 4.40 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని లెక్కగట్టింది. ఈ లెక్కన 5 లక్షల మంది స్వయం ఉపాధి యూనిట్లు ప్రారంభించడం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో 22 లక్షల ఉద్యోగాల సృష్టి సాధ్యమవుతుందని, ఇది వెనుకబడిన తరుగతుల సామాజిక-ఆర్థిక స్థితిగతులను సమూలంగా మారుస్తుంది, అంతేకాకుండా రాష్ట్ర జీఎస్డీపీ మెరుగవడానికి ఇతోదికంగా దోహదం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావంగా ఉంది.
పథకం లబ్ధిదారుల్లో వారే 80%
రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందనున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు చెందిన వారు 80% వరకు ఉన్నారు. బీసీలు అత్యధికంగా 31.44%, ఎస్సీలు 29.36%, ఎస్టీలు 19.59% ఉన్నారు. మొత్తంగా 79.39% ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు 47% ఉన్నారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు కులగణ ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది.
ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా ప్రభుత్వం ఆయా వర్గాల నుంచి 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొత్తం లబ్ధిదారుల్లో 25% మహిళలకు, 5% దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.
గతంలో 9.09 లక్షల కార్పొరేషన్ రుణాలు పెండింగ్
గతంలో వివిధ కార్పొరేషన్ల కింద ఆర్థిక సాయం కోసం వచ్చిన 9.09 లక్షల దరఖాస్తులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెడింగ్లో పెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీని వల్లే తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని, రాజీవ్ యువ వికాసం కింద పథకం లబ్ధి పొందేందుకు 16.22 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిన అనతికాలంలోనే 5 లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంఎస్ఎంఈ రంగంలో తెలంగాణలో 22 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్టు వెల్లడించారు.
ఇవీ చదవండి: CM Revanth : దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు : రేవంత్
Revanth reddy on Adani: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అదానీ రూ.100 కోట్లు వెనక్కి!
Telangana News: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Musi river: మూసీ ప్రాంత పేదలకు ప్రత్యామ్నాయం కల్పిస్తాం: రేవంత్ రెడ్డి
