Simhachalam: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో (Simhachalam) అపశ్రుతి చోటుచేసుకుంది. సింహాచలం ఆలయం వద్ద ఘోర ప్రమాదం జరిగి 8 మంది భక్తులు మృతి చెందారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద భక్తులపై గోడ కూలింది. ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు.
సింహాచలం ఘటన కలచివేసింది : సీఎం చంద్రబాబు
సింహాచలం ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నానన్నారు. కలెక్టర్, ఎస్పీతో ఘటనపై మాట్లాడానని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనకు కారణాలు, క్షతగాత్రులకు అందుతున్న సాయం తదితర అంశాలపై చర్చించారు. ఘటన తదనంతర పరిణామాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు.
సింహాచలం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతిచెందడం బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గాలి దుమారం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కూలిన గోడ నాణ్యతపై విచారణ జరుపుతామన్నారు. ఇటీవలే గోడ నిర్మాణం జరిగిందన్నారు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం : పవన్ కల్యాణ్
‘‘సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను.’’ అని పవన్ పేర్కొన్నారు.
సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు తెలిపింది. గాయపడ్డవారికి రూ.3లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. బాధిత కుటుంబసభ్యులకు దేవదాయ శాఖ పరిధిలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
సింహాచలం చందనోత్సవంలో భక్తుల మృతిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి: Durga Temple: దసరా రోజు రూ.500 టికెట్టు కొన్న వారికి దర్శనం ఎలా అంటే..
Hindu Temple in Abu Dhabi: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. విశేషాలు ఇవీ..
