Legal cell: రాష్ట్రంలో వైయస్సార్ సీపీ యాక్టివిస్టులు, సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు, అరెస్టులు వెంటనే ఆపాలని వైయస్సార్సీపీ లీగల్ సెల్ (Legal cell) డిమాండ్ చేసింది. ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘‘రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం పాలన సాగుతోంది. అందుకే సోషల్ మీడియా కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారు. 5 నెలల్లోనే అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధిస్తోంది. ప్రభుత్వ అవినీతి, అమలు కాని హామీలు, వైఫల్యాలు ఎవరు వేలెత్తి చూపినా, సోషల్ మీడియాలో ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయించి వేధించే దుష్ట సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెర తీసింది. (Legal cell)
చట్ట విరుద్ధంగా..:
ఇప్పటికే 300 మందికిపైగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41–ఏ కింద నోటీసులివ్వాలి. ఆ తర్వాత విచారణకు సహకరించని పక్షంలో అరెస్టు చేయాలని చట్టాలు చెబుతున్నా వాటిని ఉల్లంఘించి అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేసి తీసుకొస్తున్నారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ ఉంచుతున్న దానిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం లేదు. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే తప్ప వారి వివరాలు చెప్పడం లేదు. బాధితులను కోర్టు ముందు హాజరు పరచడం లేదు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప పోలీసులు స్పందించడం లేదు.
హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులు వేసిన వారిపై అక్రమంగా దాదాపు 20 కేసులు బనాయించారు. విచారణ పేరుతో వారిని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు. అలా ఇంటూరి రవికిరణ్పైన 16 కేసులు, పెద్దిరెడ్డి సుధారాణిపై 14 కేసులు పెట్టారు. అరెస్ట్ చేసిన వారిని చిత్రహింసలకు గురి చేసిన సందర్భాలు ఇప్పటికే చాలా వరకు జరిగాయి. కొన్ని కేసుల్లో స్టేషన్కు పిలిపించి రోజంతా కూర్చోబెడుతున్నారు. విచారణ పేరుతో రోజుల తరబడి తిప్పుతూ వేధింపులకు పాల్పడుతున్నారు.
బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగం
చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని తుంగలో తొక్కి, సోషల్ మీడియా కేసుల్ని ఆర్గనైజ్డ్ క్రై మ్స్ కిందకి తెస్తున్నారు. ఇటీవల భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) పేరుతో తెచ్చిన సెక్షన్.111 ను సోషల్ మీడియా కార్కకర్తలపై ప్రయోగిస్తున్నారు. ల్యాంగ్ గ్రాబింగ్లు, వరుస దోపిడీలు, కిడ్నాప్లు, దొంగతనాలు, ఆర్థిక నేరాలకు, డబ్బుల కోసం చేసే సుపారీ హత్యలు వంటి వాటిపై విధించాల్సిన 111 సెక్షన్ను ప్రయోగించి వేధిస్తున్నారు.
అయితే అదృష్టవశాత్తు కొందరు సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన 111 సెక్షన్ను న్యాయస్థానాలు రిజెక్ట్ చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలపై వ్యంగ్యమైన కార్టూన్ల ద్వారా పాలకులను నిలదీస్తే అక్రమంగా 111 సెక్షన్ పెట్టి వేధించడం దుర్మార్గం. విజయవాడ వరద సహాయ పనుల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తావిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయడమే కాకుండా, ఆ తర్వాత కూడా పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోవడం లేదు. ఎఫ్ఐర్ రిజిస్టర్ చేసిన వెంటనే 24 గంటల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. దాన్ని కోర్టుకు పంపాలి. కానీ, పోలీసులు అవేవీ చేయడం లేదు. చివరకు అరెస్ట్ చేసిన తర్వాత కూడా 41–ఏ నోటీసులు ఇవ్వడం లేదు. న్యాయస్ధానాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కొన్ని కేసుల్లో రిమాండ్ రిపోర్టులు ఇవ్వడం లేదు.
అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచి నాలుగైదు పార్టీలు చేరి పీటీ వారెంట్లతో వేర్వేరు పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. దానిపై వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించవద్దని తమకు ఆదేశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఆర్గనైజ్డ్ క్రిమినల్స్లా పోలీసులు!
ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్కు పాల్పడుతోంది పోలీసులే. ఒకే కంటెంట్ మీద ఒకటి కన్నా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం పోస్టుల ఆధారంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 30 మందిని నిర్బంధించి 10కి పైగా కేసులు బనాయించినారు. గత ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పుడూ వైయస్సార్సీపీ నాయకులు, మహిళలపై ఐ–టీడీపీ పెట్టిన, పెడుతున్న పోస్ట్లు, మార్ఫింగ్లపై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎవరైతే ఫిర్యాదు చేశారో వారి ఇళ్లకు పోలీసులు వెళ్లి ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.
జగన్ పై పెట్టిన పోస్టులపై చర్యలేవీ?
టీడీపీ నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై చేసిన ఫిర్యాదులపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. వ్యవస్థలను నాశనం చేసే ఇలాంటి పరిణామాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వాటిపై ప్రతిచర్యలు కూడా తీవ్రంగానే ఉంటాయనే సంగతి అధికార పార్టీ మరిచిపోకూడదు. డీజీపీ, డీఐజీ, ఎస్పీలు పచ్చ చొక్కాలు ధరించిన టీడీపీ నాయకుల్లా మాట్లాడుతున్నారు. కూటమి నాయకుల ఆదేశాలతో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు.
రాయలసీమ రేంజ్ ఐజీ కోయ ప్రవీణ్కుమార్ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్లో మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు తన పరిధి దాటి మాట్లాడారు. పోలీసులు ఇకనైనా, ఈ తరహా వ్యవహారాలు పూర్తిగా విడనాడాలి. చట్టబద్ధంగా వ్యవహరించాలి. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఆపాలని మనోహర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: Social media cases: కూటమి పార్టీల పోస్టులపై చర్యలు తీసుకోవాలి
Social media activists: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా పార్టీ బృందాలు
YSRCP Social Media: వైసీపీ సోషల్ మీడియాపై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్!
YS Jagan with YSRCP Social Media: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
