Court: హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ నిర్భంధాలపై హెబియస్ కార్పస్ పిటిషన్లను కుటుంబసభ్యులు దాఖలు చేశారు. ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఒకే సారి ఇన్ని పిటిషన్లు పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ తప్పుడు పిటిషన్లు అని కోర్టుకు ఏజీ తెలిపారు. ఇవన్నీ నిజమైన పిటిషన్లేనని బాధితుల తరఫు న్యాయవాది వాదించారు. బాధిత కుటుంబసభ్యులే పిటిషన్లు వేశారన్నారు. సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు లాయర్ కోరారు. దీంతో న్యాయమూర్తులు కుదరదని తేల్చిచెప్పారు.
పిటిషన్లు వేసిన వారందరినీ వదిలేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మీ మాటలను మేం ఎలా నమ్మాలని హైకోర్టు ప్రశ్నించింది. వదిలేశారనడానికి ఆధారాలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే ఈ ఆరుగురు ఎక్కడున్నారో కనుక్కుని చెప్పాలని ప్రభుత్వం తరఫు లాయర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జగన్ పిటిషన్ పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో విచారణ
మరోవైపు వైయస్ జగన్ పిటిషన్ పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ చేసింది. కౌంటర్ దాఖలుకు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది సమయం కోరారు. విచారణను ఎన్ సీఎల్ టీ వచ్చే నెల 13 కు వాయిదా వేసింది. సరస్వతి పవర్ కంపనీలో షేర్ల బదిలీపై ఎన్ సీఎల్ టీ లో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ, షర్మిల, జనార్ధన్ రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్లు బదిలీ ఫారాలు సమర్పించకుండానే తమ పేరిట మార్చుకున్నారని జగన్ అన్నారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
వైయస్సార్ సీపీ పిటిషన్ పై విచారణ
జగన్ క్యాంపు కార్యాలయ ఫర్నీచర్ వ్యవహారంపై వైయస్ఆర్సీపీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఫర్నీచర్ తీసుకెళ్లాలని జీఏడీకి లేఖ రాశామని వైయస్ఆర్సీపీ పిటిషన్ లో పేర్కొంది. లేఖపై జీఏడీ ఇంకా స్పందించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషన్ పై ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. పిటిషన్ ను సరిచేయాలని పిటిషనర్ కు న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
ఇవీ చదవండి: Supreme court on Tirumala Laddu: సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court: పార్టీల వాగ్దానాలు నమ్మితే ఎవరేం చేస్తారు?: సుప్రీం కోర్టు ప్రశ్న
AP high court news: ఏపీ హైకోర్టులో జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు ఘన వీడ్కోలు
