Jagan vs CBN: ఏపీలో ఏం నడుస్తోంది? ఒకవైపు మాజీ సీఎం జగన్ (Ex CM Jagan) ఇంటి ఫెన్సింగ్ కోసం రూ.13 కోట్లు వెచ్చించారంటూ టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ నేతల ప్రెస్ మీట్లు.. మరోవైపు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) గతంలో ఐదేళ్లలో దుబారా ఖర్చులకు చేసిన ప్రజాధనం దుర్వినియోగంపై వైయస్సార్ సీపీ రివర్స్ కౌంటర్.. (Jagan vs CBN) ఇదీ ఇవాళ్టి హాట్ టాపిక్.
అసలేం జరిగింది?
మద్యం టెండర్లలో అవకతవకలు, కూటమి పార్టీల నేతల సిండికేట్ రూపంలో ఏకపక్షంగా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలనూ కైవసం చేసుకున్నారంటూ వైయస్సార్ సీపీ ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు వారి సోషల్ మీడియాలో ప్రభుత్వం, కూటమి నేతలపై విరుచుకుపడింది. దీంతో అటు అధికార పార్టీ కూడా గతంలో జగన్ హయాంలో జరిగిన మద్యం అవకతవకలపై ఎత్తిచూపింది.
కల్తీ మద్యం, జే బ్రాండ్లు తెచ్చి జనం ప్రాణాలు తీశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈలోగా ఇవాళ జగన్ ఇంటి చుట్టూ ఇనుప కంచె కోసం రూ.13 కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కూడా ప్రెస్ మీట్ పెట్టి మాజీ సీఎంపై ధ్వజమెత్తారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా, గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ అంటూ టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. ప్యాలెస్ చుట్టూ ఉన్న వారిని బెదిరించి, ఇళ్లు ఖాళీ చేయించి వారికి సర్కార్ సొమ్ముతో వేరే చోట స్థలాలు ఇచ్చారని, ఎగ్ పఫ్ లాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ నేతలు.
వైయస్సార్ సీపీ ఏం చేసింది?
మద్యం మాఫియా, ఎల్లో సిండికేట్ దందా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, టీడీపీ సోషల్ మీడియా జగన్ ఇంటి గురించి, ఫెన్సింగ్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్సార్ సీపీ మండిపడింది. ఇందుకు ప్రతిగా 2014-19 మధ్య సీఎం చంద్రబాబు చేసిన దుబారా ఖర్చులను లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. అంతేనా.. పార్టీ నాయకుడు పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టి వివరాలు వెల్లడించారు.
జనం సొమ్మును మంచినీళ్లలా చంద్రబాబు ఖర్చు చేశారని, దుబారా ఖర్చులకు ఆయన కేరాఫ్గా మారారని పుత్తా శివశంకర్ తెలిపారు. 2014–19 మధ్య ప్రచార ఆర్భాటాలకు, హంగులు, విలాసాలకు తాత్కాలిక నిర్మాణాలకు కలిపి మొత్తం రూ.3,628.17 కోట్ల ప్రజల సొమ్ము చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇలా పరస్పరం ఇరు పార్టీల నేతలు, వారి సోషల్ మీడియా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఇందులో బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం సైలెంటుగా ఉన్నాయి. ప్రభుత్వాధినేతల సూచనల మేరకు జగన్ పై జనసేన, బీజేపీ నేతలు ఆచితూచి అప్పుడప్పుడూ విమర్శలు గుప్పిస్తున్నారు. వైయస్సార్ సీపీ మాత్రం నేరుగా చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తోంది. బీజేపీ, జనసేనలను కన్సిడర్ చేయడం లేదు.
ఇవీ చదవండి: YS Jagan on Liquor: లిక్కర్ పాలసీపై వైయస్ జగన్ సంచలన ట్వీట్
YS Jagan Good Book: గుడ్ బుక్ రాస్తున్నాం.. ప్రమోషన్లు కల్పిస్తాం!
Chandrababu Naidu: 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
Andhra News: చంద్రబాబు అలా మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉంది!
CBN on BJP Alliance: బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తృప్తి, ఆనందం: చంద్రబాబు
