TDP Janasena BJP: టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సీట్ల పంపకాలు గట్రా ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. మొత్తంగా టీడీపీ 17 ఎంపీ సీట్లు, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. ఇక బీజేపీకి ఆరు లోక్సభ, 10 అసెంబ్లీ సీట్లు ముట్టజెబుతున్నారు. TDP Janasena BJP
జనసేనకు మాత్రం మొదట 24 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలు అప్పజెప్పగా.. వాటిలో ఇప్పుడు కోత విధిస్తూ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం చేశారు. చంద్రబాబు నివాసంలో బీజేపీ పెద్దలు బైజయంత్ పండా, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, పవన్ కల్యాణ్, లోకేష్ తదితరులు కూర్చొని సీట్లను ఖరారు చేశారు.
ఓటు బదిలీ అయ్యేనా?
రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున తమకు టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తూ తమకే టికెట్ వస్తుందని, ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పొత్తు పెట్టుకున్న పార్టీలు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతూ మరొకరికి పోటీ చేసే అవకాశం కల్పిస్తుండడంతో పొత్తు కుదిరిన వేళ ఆయా స్థానాల్లో అలజడి మొదలైంది. తమకు టికెట్ రాలేదని కీలక నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీలు కలిసి పని చేసే పరిస్థితిలో ఉంటే కింది స్థాయి కేడర్ మాత్రం అందుకు భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే.. ఏ పార్టీకీ పూర్తి స్థాయిలో గెలుస్తామనే ధీమా లేకపోవడం గమనార్హం. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇదే పని ఓ ఆరు నెలల ముందు చేసి ఉంటే బాగుండేదని, అప్పటికి అసంతృప్తుల బెడద కాస్త తగ్గేదంటున్నారు. తీరా ఎన్నికల ముంగిట పొత్తు రాజకీయాలు తీరని నష్టం కలిగిస్తున్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తమకు కాకుండా పక్క పార్టీ అభ్యర్థికి సీటు వస్తే సహకరించేది లేదని ఇప్పటికే పలువురు అభ్యర్థులు కుండబద్దలు కొడుతున్న వార్తలు చూస్తున్నాం.
ముందునుంచి సాగదీస్తున్న బీజేపీ..
అసెంబ్లీ, లోక్సభ స్థానాలపై ముందు నుంచి పొత్తు విషయంపై బీజేపీ పెద్దలు సాగదీస్తూనే వస్తున్నారు. టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటున్నా జనసేన అధినేత చాలా కష్టపడి బీజేపీ పెద్దలను ఒప్పించారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణే బహిరంగ సభల్లో చెప్పారు కూడా.
బీజేపీ పెద్దలతో చీవాట్లు తిన్నానని, తిట్లు తిన్నానంటూ ఆయన బహిరంగంగా కామెంట్లు చేశారు. చివరకు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఓకే అన్నట్లుగా టీడీపీ, జనసేన పరిస్థితి వచ్చేసింది. ఒక శాతం ఓటు కూడా లేని బీజేపీకి ఏకంగా 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడంపై అటు జనసేన, ఇటు టీడీపీలోనూ అంతర్గతంగా శ్రేణులు తీవ్ర అసహనంలో ఉన్నారు.
ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి ఇరు పార్టీలు తలొగ్గక తప్పని పరిస్థితి. అంటే మూడోసారి కేంద్రంలో బీజేపీ రావడం ఖాయమనే సంకేతాలున్న నేపథ్యంలో వారితో విభేదించి కోర్టు కేసులు, జైలు ఇవన్నీ ఆలోచన చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. బీజేపీతో వెళ్లడమే బెటరని నిర్ణయానికి వచ్చారు.
ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో క్షేత్రస్థాయిలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలదీ అదే పరిస్థితి. ఇన్నాళ్లు జనంలో తిరిగి పార్టీకి, తమకు బలాన్ని చేకూరిస్తే ఇప్పుడు మరో అభ్యర్థిని అక్కడ ప్రకటించడంతో సహకరించేది లేదని చాలా మంది అభ్యర్థులు కుండబద్దలు కొడుతున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో మూడు పార్టీలకు కోలుకోలేని దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: Gudivada Amarnath: ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల బరిలో మంత్రి గుడివాడ అమర్నాథ్.. గెలుపు వరిస్తుందా?
CAA: సీఏఏ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం.. దీని ప్రకారం ఏం జరుగుతుందంటే..!
Tadikonda: తాడికొండలో గెలిచేదెవరు? నిలిచేదెవరు? తెనాలి శ్రావణ్ కుమార్ వర్సెస్ మేకతోటి సుచరిత
Penamaluru: పెనమలూరులో గెలిచేది ఆ పార్టీ అభ్యర్థేనా? సామాజిక సమీకరణాల్లో పైచేయి ఎవరిది?
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
