Telangana Exams : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియను నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ఇకపై ఉద్యోగ నియామకాల విషయంలో ఆలస్యం ఉండదని ఆయన హామీ ఇచ్చారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
ఒకే పరీక్ష ద్వారా పూర్తయ్యే ఉద్యోగ నియామకాలను మూడు నెలల్లోపు పూర్తి చేస్తామని, అలాగే మల్టిపుల్ పరీక్షలు ఉన్న నియామక ప్రక్రియలను వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఇక నుంచి అన్ని నియామకాలు ముందుగా నిర్ణయించిన గడువులోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది అభ్యర్థులకు ఊరట లభించనుంది.
నీట్ పీజీ దివ్యాంగ అభ్యర్థులకు వైకల్య పరీక్షలు – షెడ్యూల్ విడుదల
ఇదిలా ఉండగా… 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ దివ్యాంగ అభ్యర్థుల వైకల్య పరీక్షల షెడ్యూల్ను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ కటాఫ్ మార్కులను గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లోని కన్వీనర్ కోటా సీట్లకు దివ్యాంగుల కేటగిరీలో అర్హత సాధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మెడికల్ బోర్డు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
వైకల్య పరీక్షల తేదీలు ఇవే:
మెరిట్ ర్యాంకు 1 నుంచి 14 వరకు ఉన్న అభ్యర్థులు
👉 జనవరి 29న ఉదయం 10 గంటలకు హాజరుకావాలి.
ర్యాంకు 15 నుంచి 28 వరకు వచ్చిన అభ్యర్థులు
👉 జనవరి 30న ఉదయం 10 గంటలకు మెడికల్ బోర్డు ఎదుట హాజరుకావాలి.
అభ్యర్థుల పేర్లను ఇప్పటికే యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. నిర్ణీత తేదీల్లో అభ్యర్థులు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, విద్యా సంబంధిత సర్టిఫికట్లు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఈ ప్రకటనతో నీట్ పీజీ కౌన్సెలింగ్కు సిద్ధమవుతున్న దివ్యాంగ అభ్యర్థులకు కీలక స్పష్టత లభించింది.
ఇవీ చదవండి: Samsung Galaxy S26 Ultra: లాంచ్ డేట్స్ నుంచి పోటీ వరకు.. 2026లో సామ్సంగ్కు ఇదే అసలైన పరీక్ష!
India Post Jobs 2026: యువతకు శుభవార్త.. 28,740 తపాలా ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!
