Andhra Pradesh: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తూ, మొత్తం 28 జిల్లాలతో కొత్త పరిపాలనా మ్యాప్కు తుది రూపు ఇచ్చింది. ఈ మార్పులన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ప్రకారం, 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు, కాగా 17 జిల్లాల్లో 25 పరిపాలనా మార్పులు చేపట్టింది. ప్రజల అభిప్రాయాలు, అభ్యర్థనల మేరకు డివిజన్లు, మండలాల పరిధుల్లో మార్పులు చేసినట్లు మంత్రులు వెల్లడించారు.
గత ప్రభుత్వం సరైన ఆలోచన లేకుండా జిల్లాల విభజన చేసిందని ప్రభుత్వం విమర్శించింది. అప్పట్లో పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కావని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా పోలవరం పరిసర ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేసింది.
మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపినట్లు తెలిపింది. అలాగే రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని, ఆ కోరిక మేరకే మార్పు చేశామని మంత్రులు వివరించారు.
బనగానపల్లె, అడ్డరోడ్డులను కొత్త డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే అన్నమయ్య జిల్లా పేరు యథాతథంగా కొనసాగుతుందని, జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లెగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదోని నియోజకవర్గాన్ని రెండు మండలాలుగా విభజించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాయచోటి మార్పులపై స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఇది పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసమే తీసుకున్న నిర్ణయమని అన్నారు. తన రాజకీయ భవిష్యత్పై ఎలాంటి ఆందోళన లేదని, పదవి లేకపోతే నష్టపోయేది తన కుటుంబమేనని వ్యాఖ్యానించారు. రాయచోటి ప్రజల భవిష్యత్కు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: SPs Transfer : ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు.. 7 జిల్లాలకు కొత్తవారు, 7 బదిలీలు
Ranga Reddy: ముంబై, బెంగళూరు కాదు… జీడీపీలో దేశంలోనే టాప్ రిచ్ జిల్లా మనదే!
