Cyber Attack : పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నాయి. తాజాగా టాటా మోటార్స్ యాజమాన్యంలోని లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పై సైబర్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా కంపెనీ వాహనాల ఉత్పత్తి, రిటైల్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. Cyber Attack
ఉత్పత్తి నిలిచిపోయిన JLR
కంపెనీపై దాడి జరిగిన వెంటనే, JLR హ్యాకింగ్ ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. మొదట ఐటీ వ్యవస్థలను మూసివేసి నష్టాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించేందుకు వేగంగా పనిచేస్తున్నట్లు సమాచారం.
రిటైల్ వ్యాపారంపై ప్రభావం
సైబర్ దాడి కారణంగా కంపెనీ రిటైల్ కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. కస్టమర్ డేటా దొంగిలించబడిన ఆధారాలు లేవని సంస్థ తెలిపినా, ఉత్పత్తి, విక్రయాల్లో గణనీయమైన అంతరాయం కలిగిందని అంగీకరించింది.
కొత్త కార్ల డెలివరీలకు జాప్యం
సెప్టెంబర్ 1న మార్కెట్లోకి రావాల్సిన 75 కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్ల లాంచ్కు ముందే ఈ దాడి జరిగింది. ఫలితంగా డీలర్లు కొత్త కార్ల బుకింగ్స్ ప్రాసెస్ చేయలేకపోయారు. దీంతో కస్టమర్లకు వాహనాల డెలివరీ ఆలస్యమైంది.
దర్యాప్తులో నేషనల్ క్రైమ్ ఏజెన్సీ
ఈ ఘటనపై బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ స్పందిస్తూ – “జాగ్వార్ ల్యాండ్ రోవర్పై దాడి జరిగిన సంగతి మాకు తెలుసు. దాని పూర్తి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తున్నాం” అని వెల్లడించింది.
దాడికి ఎవరు బాధ్యులు?
ఈ సైబర్ దాడికి ఎవరు బాధ్యులో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇటీవలి కాలంలో Marks & Spencer, Co-op వంటి ప్రముఖ రిటైల్ సంస్థలపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. వాటిలాగే ఇక్కడ కూడా హ్యాకర్లు డబ్బు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: Maruti 5 star rating car: ఫైవ్ స్టార్ సేఫ్టీ.. మారుతీ కారు ప్రత్యేకతలు తెలుసా?
