Srisailam Prasadam : శ్రీశైల దేవస్థానంలో భక్తులు కొన్న లడ్డూ ప్రసాదంలో కీటకం వచ్చిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియాలో లడ్డూ ప్రసాదంలో కీటకం (బొద్దింక) ఉందని ప్రచారం చేస్తున్నారని, ఆయా వీడియోలు, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట లడ్డూ ప్రసాదంలో కీటకం లేదని, ఉద్దేశపూర్వకంగా మిడతను చొప్పించి వీడియో తీశారని తెలుస్తోందని స్పష్టం చేశారు. (Srisailam Prasadam)
దేవస్థానం పోటులో ప్రసాదాలను అత్యంత పరిశుభ్ర వాతావరణంలో సిద్ధం చేస్తామని, తయారు చేసే సిబ్బంది అందరూ చేతికి గ్లవుజులు, తలకు టోపి, సంప్రదాయ వస్త్రధారణతో చేస్తారని వివరించారు. పోటులోకి ఎటువంటి కీటకములు వచ్చే అవకాశం లేని విధంగా నిర్మాణం చుట్టూ గ్లాస్ ఫ్రేమ్, మెష్ కూడా ఉందని స్పష్టం చేశారు. భక్తుడు ఆరోపించిన విషయాలను సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించగా, కౌంటర్లో లడ్డూలు కొనుగోలు చేసిన అనంతరం ఒక కవరు ఆరోపణ చేసిన భక్తుడికి అందజేసినట్లు, తర్వాత ఆయన మరో ముగ్గురితో కలిసి కౌంటర్లో కొన్న లడ్డూలో కీటకం వచ్చినట్లు వాగ్వాదం చేసినట్లు గుర్తించామని వివరించారు.
వారిలో ఒకరు ఫోన్తో లడ్డూలో కీటకం ఉన్నట్లు చిత్రీకరించినట్లు గుర్తించామన్నారు. ఆరోపణ చేసిన కె. శరస్ చంద్ర కావలికి చెందిన వారని, తమకు ఫిర్యాదు చేసిన ప్రతిని మీడియాకు అందించనట్లు భావిస్తున్నామని తెలిపారు. భక్తులు దర్శనానికి వెళ్లే ముందు ఫోన్లను భద్రపరిచి, దర్శనానంతరం ప్రసాద విక్రయకేంద్రంలో కొనుగోలు చేసిన అనంతరమే ఫోన్ తిరిగి తీసుకోగలుగుతారని, కానీ దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో లడ్డూ మధ్యలో కీటకాన్ని చొప్పించి వీడియో తీసినట్లు అనిపిస్తోందని ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఘటనపై శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కనుక ప్రసాదంలో కీటకం అనే ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులను కోరారు.
ఇవీ చదవండి: Tirumala Laddu : కియోస్క్ యంత్రాల ద్వారా శ్రీవారి లడ్డూల విక్రయం
Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ ప్రారంభం
CPM Baburao: తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ.. వరద బాధితులను ఆదుకోవడంపై పెట్టండి
