Rushikonda Buildings: గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రుషికొండ పర్యాటక భవనాలు (Rushikonda Buildings) నిర్మిస్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు అవి చూసి ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న తాను, ఆ తరహా భవనం ఒక్కటి కూడా కట్టలేదన్న బాధ చంద్రబాబు మనసులో ఉందని ఆయన తెలిపారు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అవి పర్యాటక శాఖ భవనాలని స్వయంగా ప్రొటోకాల్ విభాగం ప్రకటించినా, అవి జగన్ తన కోసం కట్టుకున్నారని, అది ప్యాలెస్ అని, విలాసవంతమైన భవన సముదాయమని, సొంత ఆస్తిలా నిర్మాణం చేసుకున్నారని అదే పనిగా అసత్యాలు చెబుతున్నారని గుర్తు చేశారు.
రూ.1100 కోట్లు. నాసిరకం పనులు
విభజిత రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాలకే రూ.1100 కోట్లు ఖర్చు చేశారని, అవన్నీ నాసిరకం నిర్మాణాలని, వర్షం పడితే కురుస్తోందని మాజీ మంత్రి ప్రస్తావించారు. వర్షం కురిస్తే మంత్రుల కార్యాలయాల్లోకి నీరొచ్చిన చరిత్ర గతంలో లేదన్న ఆయన, అలాంటి నాసిరకం నిర్మాణాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేసారు.
అన్నింటికీ ప్రజలను అనుమతించాలి
విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన జగన్, ముగ్గురు సీనియర్ ఐఏఎస్ల నివేదిక మేరకు, రుషికొండపై సీఎం అధికారిక నివాసం కోసం భవనాలు నిర్మించారు తప్ప, ఆయన తన కోసం కట్టుకోలేదని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గ్రహించాలన్న ఆయన, రుషికొండ భవనాలతో పాటు, జగన్ హయాంలో నిర్మితమైన, ఇప్పుడు పురోగతిలో ఉన్న పలు ప్రాజెక్టులు.. రూ.700 కోట్లతో ఉద్దానంలో నిర్మించిన ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఇనార్బిట్ మాల్ను.. ఇంకా చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకున్న అమరావతిలో రూ.1100 కోట్లతో నిర్మించిన తాత్కాలిక సచివాలయాన్ని కూడా ప్రజల సందర్శనకు అనుమతించాలని కోరారు. అప్పుడు ప్రజలకు అన్నీ అర్థమవుతాయని చెప్పారు.
ఆ విషయం చెప్పాలి
రుషికొండ భవనాలు ఎలా ఉపయోగించాలన్నది చంద్రబాబు నిర్ణయమన్న మాజీ మంత్రి, ఏ నిర్ణయమైనా ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కోరారు. ఒకవేళ కూల్చాలనుకున్నా, అదే విషయాన్ని నిర్భయంగా చెప్పాలని అన్నారు. తనకు తాను విజనరీగా చెప్పుకుని ప్రచారం చేసుకునే చంద్రబాబు.. ఎన్నడూ ఎదుటి వ్యక్తిని పొగిడింది లేదని, రుషికొండ భవనాల విషయంలో తొలిసారి జగన్ ని మెచ్చుకోవడం అభినందనీయమని అన్నారు.
బాబు దుబారా వ్యయం
చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పోలవరం నిర్మాణం చూపించడానికి దాదాపు రూ.150 కోట్లు, హైదరాబాద్ లో లేక్వ్యూ గెస్ట్హౌజ్ను అధికారిక కార్యాలయంగా ప్రకటించుకుని, దాని మరమ్మతులు, ఫర్నీచర్ కోసం రూ.10 కోట్లు, సొంత ఫామ్హౌజ్లో రక్షణ కోసం రూ.12 కోట్లు, జూబ్లీ హిల్స్ ఇంటికి రూ.8 కోట్లు, ఆ ఇంటి నిర్మాణం జరిగినన్ని రోజులు పార్క్ హయత్ హోటల్లో ఉంటూ, దాన్ని క్యాంప్ ఆఫీస్గా చూపి అద్దె కింద రూ.30 కోట్లు, విజయవాడ ఇరిగేషన్ గెస్ట్హౌజ్కు రూ.42 కోట్లు, కరకట్టపై ఇప్పుడు తాను ఉంటున్న అక్రమ కట్టడం.. లింగమనేని ఇంటికి రూ.10 కోట్లు ఖర్చు చేశారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
ఇది మరో డైవర్షన్ పాలిటిక్స్
తాత్కాలిక విడిది, హంగూ, ఆర్భాటాల కోసం వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేసిన చంద్రబాబు, ప్రభుత్వ అవసరాల కోసం రుషికొండపై ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేస్తే చంద్రబాబు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు గడిచినా, ఇంకా రోజూ జగన్ పై ఏడవడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఆర్భాటంగా సూపర్సిక్స్ ప్రకటించిన కనీసం సింగిల్ రన్ కూడా చేయలేదని దుయ్యబట్టారు.
హామీలు అమలు చేయకపోవడం, సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటన్న గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు కూడా అదే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తేల్చి చెప్పారు. (Rushikonda Buildings)
స్టీల్ప్లాంట్పై నోరెందుకు మెదపలేదు?
విశాఖ పర్యటనలో సీఎం చంద్రబాబు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని అంతా ఆశించారని, కానీ ఆయన ఆ ఊసే ఎత్తలేదని మాజీ మంత్రి మండిపడ్డారు. ప్లాంట్లో 400 మందిని తొలగించారని, సెప్టెంబరు నెల జీతాలు ఇంకా కొందరికీ జమ కాలేదని, మరికొందరికి హెచ్ఆర్ఏ కూడా ఇవ్వలేదన్న ఆయన, సమస్యలు చెప్పుకోవడం కోసం స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలు కలుస్తామంటే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆక్షేపించారు.
ఇంకా ప్లాంట్లో 4వేల మంది కాంట్రాక్టు లేబర్ను తొలగించాలని, 2468 మందితో వీఆర్ఎస్ చేయించాలని, దాదాపు 2 వేల మందిని బదిలీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో.. వాటిని పరిష్కరించకుండా, అనకాపల్లి వద్ద కొత్తగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఆ ప్లాంట్ తమ ప్రభుత్వ హయాంలోనే ప్రస్తావనకు వచ్చిందన్న ఆయన, నాడు సీఎంను కలిసిన మిట్టల్ గ్రూప్ ప్రతినిధులు 3వేల నుంచి 4వేల ఎకరాల భూమి ఇస్తే, స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
ఇవీ చదవండి: Rushikonda: రుషికొండ భవనాలపై చంద్రబాబు కీలక కామెంట్స్.. ఏమన్నారంటే
Rushikonda: అద్భుతమైన భవనాలు కడితే దుర్మార్గం.. ఏమీ కట్టకపోతే అమోఘం!
Gudivada Amarnath: వరదలపై ముందే సమాచారమున్నా ప్రజలను అలర్ట్ చేయలేదు
Gudivada Amarnath on CBN: చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్
