Lord Venkateswara: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. ఇలవేల్పుగా కొలిచే వారి గృహాల్లో నిత్యం స్వామి వారిని వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రం నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారి కళకళలాడుతోందంటే అందుకు కారణం స్వామి మహత్యమే. స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి, తమ కోర్కెలు స్వామివారితో చెప్పి ఈ కలియుగంలో ఈతిబాధలు తొలగింపజేసుకోవాలని రోజూ లక్షలాది మంది ప్రయత్నిస్తుంటారు. (Lord Venkateswara)
శ్రీవేంకటేశ్వర స్వామి ఎవరిని ఇష్టపడతారు? ఏ రకమైన పూజలు చేస్తే స్వామి వారి దయ మనపై కలుగుతుందనేది అందరికీ ఉండే సందేహం. శ్రీవారికి శనివారం ఇష్టమైన రోజు అని అందరికీ తెలిసిందే. ఆరోజు తులసిమాలతో స్వామి వారిని ప్రతి ఇంట్లో పూజిస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి శ్రీవేంకటేశ్వర సుప్రభాతం వింటూ ఉంటారు. ఇక స్వామి ఎలాంటి వాతావరణాన్ని ఇష్టపడతారు? ఏ పూజలు చేయాలనే విషయం అందరికీ ఆసక్తి కలిగించే అంశం.
స్వామి గురించి నారద మహర్షి ఓ సందర్భంలో చెబుతూ..
”మద్ భక్తాహ యత్ర గాయంతి.. తత్ర తిష్టామి నారద..”
సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు నారదునితో అన్న మాటలివి. అంటే దీని అర్థం.. “నారదా.. నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లోనూ ఉండను.. ఎక్కడ నా భక్తులు పాడుతూ ఉంటారో.. అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను..” అని ఈ వాక్యాలకు అర్థం. ఆ స్వామి వారికి గానం అన్నా, అన్నమయ్య సంకీర్తనలు అన్నా అంతటి ప్రీతిపాత్రం. అందుకే శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఎవరు భక్తి పారవశ్యంతో కొలిచి పాటలు పాడుతారో.. అక్కడే స్వామి వారు వాలిపోతారట.
అందుకే.. స్వామి వారిని చూసి పరవశిస్తూ అన్నమాచార్యులు వేలాది పాటలు రాసి, పాడి మనందరికీ అందించారు. సాక్షాత్తూ శ్రీ స్వామి వారే అన్నమయ్యను జన్మించేలా చేశారని పెద్దలు చెబుతారు. అన్నమయ్య రాసిన సంకీర్తనలు వింటే స్వామి వారు నఖశిఖ పర్యంతం మనకు దర్శనమిచ్చినట్లే అనుభూతి కలుగుతుంది.
ఆ కీర్తనలకు అంతటి గొప్ప ప్రాశస్త్యం, భక్తి పారవశ్యం ఉన్నాయి కాబట్టే స్వామి వారు అలాంటి పాటలు పాడిన వారి చెంత ఉంటారట. ఏ ఇంట్లో అయితే స్వామి వారిని పాటలతో ఆరాధిస్తారో వారికి ఏ లోటూ ఉండదని పెద్దలు చెబుతున్నారు. మరింకేం.. అన్నమయ్య కీర్తనలు, శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాటలతో పూజించి స్వామివారి కృపకు పాత్రులై తరించండి.
