DGP on punganuru incident: పుంగనూరు అల్లర్లు, విధ్వంసకాండపై ఇప్పటి వరకు 80 మందిని అరెస్టు చేశామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరులో పోలీసుల పై అల్లరి మూకల దాడులు సరికాదని ఖండించారు. పోలీసుల పై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (DGP on punganuru incident)
పుంగనూరులో దాడికి పాల్పడింది స్థానికులా, బయట వ్యక్తులా అన్నది తేలాల్సి ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోందన్నారు. శాంతిభద్రతలు దెబ్బతీసేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. 1.40 లక్షల మంది మహిళలు దిశ యాప్ లో రిజిస్టర్ చేసుకున్నారని వివరించారు.
ఇప్పటి వరకు 27 వేల మంది మహిళలు దిశ యాప్ సాయంతో ఆపదలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20 శాతం నేరాలు తగ్గాయన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికలతో ఏపీలో గంజాయి నియంత్రణ చేస్తున్నామని వివరించారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు తగ్గుముఖం పట్టిందని ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో స్థానిక ప్రజలు, స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నూతనంగా నిర్మించిన రెండు అంతస్తుల డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుతం నరసాపురంలో కొనసాగుతున్న డీఎస్పీ కార్యాలయం భవనం వంద సంవత్సరాల క్రితం నిర్మామితమైన పురాతన భవనంలో కొనసాగుతుందన్నారు. ఇటీవల కాలంలో ఆ భవనం శిథిలావస్థకు చేరడంతో ఆ భవనానికి పునరుద్ధరణ పనులు చేపడితే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ భవనం మనుగడ కోల్పోతుందని భావించిన స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యామ్నాయంగా సమీపంలోనే నూతనగా అత్యంత ఆధునిక సదుపాయాలతో డీఎస్పీ నివాసంతో కూడిన రెండవ అంతస్తుల భవనాన్ని నిర్మించడం ఎంతో అభినందనీయం అన్నారు.
ఈ నూతన భవనంలో డీఎస్పీ కార్యాలయం 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో, డీఎస్పీ నివాసం మొదటి అంతస్తు 2300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగిందని ప్రజలతో సత్సంబంధాలు లేకుండా పోతే ఇటువంటి మంచి కార్యక్రమం జరిగేది చాలా అసాధ్యమన్నారు. ఇక్కడ పనిచేసే `అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల మధ్య మంచి అనుసంధానం ఉంది కాబట్టే ఒకటి చక్కటి ఆలోచనతో పోలీసులకు కట్టించి ఇవ్వడం అనేది మంచి పరిణామం అన్నారు.
ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజల సహకారంతో నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు. ఎక్కడైతే ఈ చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ ప్రజలకు పోలీసుల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అవగతం అవుతున్నాయన్నారు. పోలీసుల పైన ప్రేమ అభిమానాలు లేకపోతే ఈ రకమైనటువంటి చక్కటి ఆలోచన కలిగి ఉండేది కాదని, ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాల్లో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Read Also : DGP Rajendranath Reddy: అదృశ్యమైన 26 వేల మందిలో 23 వేల మందిని గుర్తించాం..: డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి