మంగళవారం, 15 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

CM Jagan Review On GIS: విశాఖ ఐటీ హబ్‌ కావాలి.. రివ్యూ మీటింగ్‌లో సీఎం జగన్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 6 జూన్ 2023

CM Jagan Review On GIS: విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. ఆ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం (CM Jagan Review On GIS) నిర్వహించారు. శాఖల వారీగా కుదిరిన ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితిపై సీఎం సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక విశాఖపై స్పెషల్‌ ఫోకస్‌పెట్టిన జగన్ సర్కార్.. అక్కడ ఐటీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విశాఖ ఐటీకి చిరునామా కావాలని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. (CM Jagan Review On GIS)

ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని పేర్కొన్నారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

సమీక్ష సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధి బాగుందని వివరించారు. స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36 శాతం, ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ అని వివరించారు. గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందని వెల్లడించారు. 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43 శాతానికి పెరిగిందన్నారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని పేర్కొన్నారు. జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13 లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21 శాతం నుంచి 23 శాతానికి పెరిగిందని చెప్పారు.

పెట్టుబడుల వెల్లువ..

2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు తెలిపారు. 2022-23లో రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని చెప్పారు. 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు కాగా, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. రూ.1.6లక్షల కోట్లు పెరిగిందన్నారు.

పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలన్నారు. దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

పరిశ్రమల శాఖలో ఎంఎస్‌ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలన్నారు. రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న డిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

కార్యరూపంలోకి ప్రతిపాదనలు..

పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలనూ ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి… 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అధికారులు వెల్లడించారు. వీటిద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. కానీ ఇందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని వెల్లడించారు.

విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయని చెప్పారు. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీకూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.

Read Also : CM Jagan: రైతన్నల మేలు కోరే ప్రభుత్వమిది.. యంత్ర సేవ పథకంలో ట్రాక్టర్ల పంపిణీ

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading