TTD Anna Prasadam: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు తిరుమలతో పాటు కొద్ది టీటీడీ ఆలయాల్లో మాత్రమే కొనసాగుతున్న అన్నప్రసాద వితరణను ఇకపై అన్ని టీటీడీ ఆలయాలకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు మార్చి నెలాఖరు నుంచి అన్ని టీటీడీ ఆలయాల్లో రెండు పూటలా అన్నప్రసాద వితరణ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది.
🔸 అన్ని ఆలయాల్లో రెండు పూటల అన్నప్రసాదం
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ప్రస్తుతం టీటీడీ పరిధిలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరుకల్లా టీటీడీకి చెందిన అన్ని ఆలయాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా అన్నప్రసాదం అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
🔸 పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం
అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతులు ఇచ్చి స్థలాలు కేటాయించినట్లు ఈవో తెలిపారు.
సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి, కేటాయించిన స్థలాలను టీటీడీ స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలక మండలి సమావేశం ముందు ఉంచాలని సూచించారు.
అలాగే చెన్నైలో కేటాయించిన స్థలంలో ఆలయ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు, పరిపాలనా అనుమతులను టీటీడీ బోర్డు ఆమోదానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
🔸 రుషికేష్ పీఏసీపై కీలక ఆదేశాలు
రుషికేష్లోని Pilgrim Amenities Complex (PAC) శిథిలావస్థకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన ఈవో, ఇంజనీరింగ్ విభాగం పూర్తిస్థాయి పరిశీలన చేపట్టి ఫిబ్రవరి నెలలోపు నూతన పీఏసీ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
🔸 టీటీడీలో ఉద్యోగ నియామకాలు
టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేయాలని ఈవో ఆదేశించారు.
వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో ఇప్పటికే 164 మందిని టీటీడీ ఆలయాల్లో నియమించగా, మిగిలిన 536 మందిని ఇతర ఆలయాల్లో నియమించేందుకు ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు.
అదేవిధంగా టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా
150 మంది అర్చకులకు
68 మంది పోటు వర్కర్లకు
ఫిబ్రవరి నెలలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
🔸 భక్తుల సేవల్లో మరింత మెరుగుదల
భక్తుల నుంచి వస్తున్న ఈ–మెయిల్స్ను నిరంతరం పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.
ఈ నిర్ణయాలతో భక్తులకు మరింత సౌకర్యాలు అందనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: TTD : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఉచిత అన్నప్రసాదం
Vastu Tips: అద్దె ఇల్లు కదా అని నిర్లక్ష్యం చేయకండి.. వాస్తు దోషం ఉంటే సమస్యలు తప్పవు!
