Crime News : పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్గౌడ్ (33) సోషల్ మీడియాలో నకిలీ ఐడీతో మోసాలకు పాల్పడ్డాడు. జగిత్యాల పట్టణంలోని శంకులపల్లి ప్రాంతానికి చెందిన బైరవేని సమతకు ఇన్స్టాగ్రామ్లో ‘సంధ్య’ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి స్నేహం చేశాడు. ఆ తర్వాత తాను అబ్బాయినని, పెళ్లి కాలేదని, ఒకే కులమని నమ్మించి సమతను మోసం చేశాడు.
ఇదే క్రమంలో సమతకు తెలియకుండా తన సోదరి సంధ్య మొబైల్ను హ్యాక్ చేసి, ఆమె నంబర్ను ‘లేడీస్ సారీస్ కలెక్షన్స్’ అనే వాట్సప్ గ్రూప్లో యాడ్ చేశాడు. అక్కడినుంచి సంధ్యతో కూడా తరచూ చాటింగ్, ఫోన్ కాల్స్ చేస్తూ దగ్గరయ్యాడు. అయితే మహేందర్కు ఇప్పటికే పెళ్లి అయిందన్న విషయం బయటపడటంతో సమత అతనికి దూరంగా ఉండడం ప్రారంభించింది.
దీంతో సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మహేందర్.. తననే పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి కొడుకుకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అంతేకాదు.. సమత అక్క సంధ్యతో కూడా తాను మాట్లాడుతున్నానని, వారి ఫోటోలు, కుటుంబ సభ్యుల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
ఈ విషయం తెలుసుకున్న సమత వెంటనే తన అక్క సంధ్యకు జరిగినదంతా చెప్పింది. ఇద్దరూ పరిశీలించగా, తమతో చాటింగ్ చేసిన వ్యక్తి ఒక్కడేనని స్పష్టమైంది. ఈ విషయాన్ని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మేనమామ నరేశ్కు చెప్పడంతో, మహేందర్ను హత్య చేయాలని సంధ్య, నరేశ్, సంధ్య కుమారుడు రాజశేఖర్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి పథకం రచించారు.
ప్లాన్ ప్రకారం సంధ్యతో మహేందర్కు ఫోన్ చేయించి లక్ష్మీపూర్కు రావాలని పిలిపించారు. శుక్రవారం రాత్రి 10–11 గంటల మధ్య వస్తానని మహేందర్ వాట్సప్ మెసేజ్ చేయగా సంధ్య ఒప్పుకుంది. ముందుగా సమతను అమ్మమ్మ ఇంట్లో ఉంచి, నరేశ్ కారులో జగిత్యాల కొత్త బస్టాండ్కు చేరుకున్నారు. వెనకాల స్కూటీపై రాజశేఖర్, అతని స్నేహితులు వచ్చారు.
కొత్త బస్టాండ్ వద్ద సంధ్య కారులోంచి దిగిపోయి స్కూటీపై మహేందర్ను ఎక్కించుకుని లక్ష్మీపూర్ వైపు బయల్దేరింది. అదే సమయంలో నరేశ్, రాజశేఖర్, మరో ఇద్దరు స్నేహితులు కారులో వెంబడించారు. ఇంటి వద్దకు చేరుకున్న వెంటనే అనుమానం వచ్చిన మహేందర్ పారిపోవడానికి ప్రయత్నించగా, సంధ్య గేటు వద్ద అతన్ని అడ్డుకుంది. వెంటనే మిగతా వారు అతన్ని చితకబాదుతూ ఫోన్ లాక్కొన్నారు.
ఈ సమయంలో సంధ్య ఇంట్లో ఉన్న కారంపొడిని మహేందర్పై చల్లగా, ఇప్పటికే గాయాలపాలైన అతను కిందపడిపోయాడు. అనంతరం రాజశేఖర్ మరియు అతని ఇద్దరు మిత్రులు కర్రలు, ఇనుపరాడ్తో దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహేందర్ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం లక్ష్మీపూర్ గ్రామ శివారులో నిందితులను అరెస్ట్ చేశారు. లక్ష్మీపూర్కు చెందిన సంధ్య, రాజశేఖర్, నరేశ్, శంకులపల్లికి చెందిన సమతలను రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి స్కోడా కారు, స్కూటీ, ఇనుపరాడ్, కర్ర, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..
Allu Arjun: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. ఏమైందంటే..
