HomeAndhra PradeshAndhra Pradesh : ఏపీలో హృదయవిదారక ఘటన.. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో...

Andhra Pradesh : ఏపీలో హృదయవిదారక ఘటన.. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక చెత్త రిక్షాలో మృతదేహం తరలింపు

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగుచూసింది. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (65) అనే నిరుపేద వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలను కలచివేశాయి.

తీవ్ర అస్వస్థతకు గురైన రాధమ్మను కుటుంబ సభ్యులు భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలోనే మృతి చెందింది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతదేహాల తరలింపునకు అంబులెన్స్ సౌకర్యం ఉండాలి. కానీ ఈ ఘటనలో ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకునే స్థోమత లేకపోవడంతో చివరికి కుటుంబ సభ్యులు చెత్త రిక్షాను ఆశ్రయించాల్సి వచ్చింది. వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త రిక్షాపై తరలిస్తూ వారు పడిన అవమానం, వేదన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఇది ఒక్క కుటుంబానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు.. ప్రభుత్వ వైద్య వ్యవస్థ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు కనీస అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పేదల ప్రాణాలకు, వారి గౌరవానికి విలువ లేకుండా పోతోందంటూ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి: Jail: ప్రపంచంలోనే అత్యంత క్రూయల్ జైల్ ఏదో తెలుసా?
Gurla: నాడు గ్రామ స్వరాజ్యం.. నేడు ఎక్కడ చూసినా దయనీయం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు