Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. రాత్రి, తెల్లవారుజామునే కాదు.. మధ్యాహ్నం వేళల్లో కూడా చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు, జాకెట్లు ధరించి బయటకు రావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోగా, రాబోయే రోజుల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మార్చి వరకు చలి తీవ్రత కొనసాగొచ్చని, ముఖ్యంగా ఉదయాన్నే పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి:
రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లి – 6.9°C
జగిత్యాల జిల్లా కథలాపూర్ – 10.1°C
రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలు – 9.9°C
సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట – 8.9°C
నిజామాబాద్ జిల్లా సాలూర – 8.6°C
మెదక్ జిల్లా దామరంచ – 7.9°C
కామారెడ్డి జిల్లా రామరలక్ష్మణ్పల్లి – 7.9°C
హైదరాబాద్లోనూ సింగిల్ డిజిట్
హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్లో 9.4°C, నారాయణపేటలో 9.5°C, మౌలాలిలో 9.1°Cగా నమోదవ్వడంతో నగరవాసులు చలితో వణికిపోతున్నారు. పొగమంచు తోడవడంతో ఉదయాన్నే రోడ్లపై వాహనాల రాకపోకలు తగ్గాయి.
వాతావరణశాఖ అంచనా ప్రకారం రాబోయే రెండు రోజులు చలి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల వరకు తగ్గవచ్చని, గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని తెలిపింది. చలి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: Winter care : చలికాలంలో స్వెటర్లు వేసుకుని పడుకోవడం మంచిదేనా? వైద్యపరంగా ఏది సరైంది?
Winter : చలికాలంలో చన్నీటి స్నానం మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పిన లాభాలు–జాగ్రత్తలు ఇదే!
