No Handshake Policy : అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన 5వ మ్యాచ్ కేవలం క్రికెట్ పరంగానే కాకుండా, ఇరు జట్ల కెప్టెన్ల ప్రవర్తనతో కూడా హాట్ టాపిక్గా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మ్యాచ్లలో భారత్ అవలంబిస్తున్న నో-హ్యాండ్షేక్ పాలసీ ఈ మ్యాచ్లోనూ కొనసాగింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సందర్భంగా భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, పాకిస్తాన్ కెప్టెన్తో చేతులు కలపకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అంశంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ముందుగానే జోక్యం చేసుకుని, జూనియర్ స్థాయి క్రికెట్ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భారత్ను కోరినప్పటికీ, బీసీసీఐ ఆ విజ్ఞప్తిని పాటించలేదు.
జూనియర్ క్రికెట్లో రాజకీయాలు వద్దని ఐసీసీ సూచన
జూనియర్ స్థాయి టోర్నమెంట్లలో రాజకీయ అంశాలు చోటు చేసుకోకూడదని, అందులో భాగంగా హ్యాండ్షేక్ను మానేయడం వంటి విధానాన్ని విరమించుకోవాలని ఐసీసీ కోరినట్లు మ్యాచ్కు ముందు వెలువడిన పీటీఐ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ, భారత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
భారత సైనికులకు, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ నో-హ్యాండ్షేక్ పాలసీని మొదటగా గత సెప్టెంబర్లో జరిగిన సీనియర్ ఆసియా కప్ మ్యాచ్లో అమలు చేశారు. ఆ తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లలో కూడా భారత్–పాకిస్తాన్ మ్యాచ్లలో ఇదే విధానాన్ని కొనసాగించారు.
నిర్ణయం బీసీసీఐకే
ఈ విధానాన్ని కొనసాగించాలా, వద్దా అన్న తుది నిర్ణయాన్ని బీసీసీఐకే ఐసీసీ వదిలేసింది. అయితే కొనసాగిస్తే, మ్యాచ్కు ముందే మ్యాచ్ రెఫరీకి సమాచారం ఇవ్వాలని సూచించింది.
ఆదివారం జరిగిన అండర్-19 మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఆయనతో చేతులు కలపకుండా వెనక్కి నిలబడ్డాడు. యాంకర్తో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం, యూసుఫ్ మైక్రోఫోన్ను మ్హాత్రేకు ఇచ్చి, ఎలాంటి మాటల మార్పిడి లేకుండా నేరుగా డగౌట్కు వెళ్లిపోయాడు.
వర్షం వల్ల మ్యాచ్ ఓవర్లు తగ్గింపు
దుబాయ్లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఈ మ్యాచ్ను 49-49 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఇవీ చదవండి: IND vs PAK: ఐసీసీ సర్ప్రైజ్ ట్విస్ట్.. భారత్–పాక్ మ్యాచ్ లేకుండానే U-19 వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదల
Tesla India : టెస్లా ఇండియాలో కీలక అడుగు: గురుగ్రామ్లో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
