– బీఆర్ఎస్కు సహకరిచడానికి డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపిన బీజేపీ!
– బీజేపీని రక్షించడానికే కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఓట్ చోరీ ఆరోపణలు
Jubilee Hills by-election : బీజేపీ-బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య పొత్తు మరోసారి బట్టబయలైందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో బీజేపీ తన అభ్యర్థిగా లంకల దీపక్ పేరును ప్రకటించడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. బీఆర్ఎస్కు సహకరించడానికే బీజేపీ డమ్మీ అభ్యర్థిని బరిలో నిలిపిందని ఆరోపిస్తున్నారు. గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన దీపక్ నియోజకవర్గంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని, అప్పుడు కూడా జూబ్లీహిల్స్లో బీజేపీ సహకరించడం వల్లే బీఆర్ఎస్ గెలిచిందని అంటున్నారు.
ఈ ఉపఎన్నికలో కూడా బీఆర్ఎస్కు బీజేపీ అన్ని రకాలుగా సహకరిస్తోందని, ఇంకొన్ని అంశాల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచారంలో అనుసరిస్తున్న పంథాను నిశితంగా గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందని అంటున్నారు. ఇటీవల కాలంలో దేశంలో ఓట్ చోరీ ద్వారా బీజేపీ ఎన్నికలు గెలుస్తోందని ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. దీంతో ఈ అంశంలో బీజేపీని రక్షించడానికే బీఆర్ఎస్, కేటీఆర్ కృషి చేస్తున్నారనే వాదన బలపడుతోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడుతోందంటూ కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేయడం ఇందులో భాగమని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలు తప్పని తేటతెల్లమైంది. కేటీఆర్ ఇటీవల 19,000 ఓటర్లు నకిలీ అని లేవనెత్తిన ఆరోపణలు అవాస్తవమని, ఈ ఓటర్లందరూ 2023, 2024 అసెంబ్లీ-లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్నవారే అని స్పష్టమైంది. బీజేపీపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్పై బీఆర్ఎస్ చేస్తోందని, ఇదంతా కూడా బీజేపీని రక్షించడానికి, తద్వారా తాను లబ్ధిపొందడానికే బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఆరోపణలను సమర్థించేలా బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జ్ అమిత్ మాలవీయ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
రాహుల్ గాంధీ ఓట్ చోరీకి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోందని అమిత్ వ్యాఖ్యానించడం ఈ రెండు పార్టీల కుట్రలకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ అండ చూసుకొనే ఈ అంశంలో బీఆర్ఎస్, కేటీఆర్లు కాంగ్రెస్ లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పటికే మైనారిటీలు సహా బీసీ సామాజిక వర్గాలు దూరమవ్వడంతో బీజేపీని ఉపయోగించుకొని లబ్ధిపొందేందుకు బీఆర్ఎస్ రాజకీయ కుయుక్తులు పన్నుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓట్ చోరీ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు, బీఆర్ఎస్కు సహకరించేందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని బరిలో నిలపడం అందులో భాగమని విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి: Jubilee Hills by-election : మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల భాగోతం
Jubilee Hills by-election : నవీన్ యాదవ్కు ‘హస్తం’ టికెట్.. బీసీ బిడ్డకు పట్టం ఖాయమా?
