EVM : భారత ఎన్నికల సంఘం రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం EVM బ్యాలెట్ పేపర్ల డిజైన్లో కీలక మార్పులు చేసింది. ఇకపై బ్యాలెట్ పత్రాలలో అభ్యర్థుల రంగు ఫోటోలు, పెద్ద సైజ్ సీరియల్ నంబర్లు, స్పష్టమైన ఫాంట్ డిజైన్ కనిపించనున్నాయి.
కొత్త మార్పుల ప్రకారం, అభ్యర్థుల ఫోటోలు కలర్లో ముద్రించబడతాయి. ఫోటో కోసం కేటాయించిన స్థలంలో మూడో వంతు భాగాన్ని ఫోటో కవర్ చేస్తుంది. దీంతో ఓటర్లు అభ్యర్థి ముఖాన్ని స్పష్టంగా గుర్తించగలరు. అదనంగా సీరియల్ నంబర్లు అంతర్జాతీయ భారతీయ అంకెల రూపంలో 30 సైజు, బోల్డ్ ఫాంట్లో ముద్రించబడతాయి.
అభ్యర్థుల పేర్లు మరియు NOTA ఒకే విధమైన ఫాంట్ స్టైల్లో, సులభంగా చదవగలిగే విధంగా ఉంటాయి. మొత్తం బ్యాలెట్ పేపర్ను 70 GSM గులాబీ రంగు కాగితంపై ముద్రిస్తారు. గులాబీ రంగుకు ప్రత్యేక RGB విలువలు నిర్ణయించబడ్డాయి.
ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తు, సీరియల్ నంబర్ మాత్రమే ఉండేది. ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లేదా చిన్న పరిమాణంలో ఉండేవి. ఈ కొత్త మార్పులతో పోలింగ్ బూత్లలో గందరగోళం తగ్గి, ఓటర్లు సులభంగా తమ అభ్యర్థిని గుర్తించగలరని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రక్రియలను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మార్చి ఓటర్ల విశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో ఈ మార్పులు అమలులోకి వస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమై, రాబోయే అన్ని ఎన్నికల్లో ఈ కొత్త డిజైన్ను అమలు చేయనున్నారు.
ఇవీ చదవండి: EVM Hacking: ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనా? ఏఐ ఏం చెప్పిందో తెలుసా?
EVM Management: ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టంపై నోడల్ అధికారులకు శిక్షణ
