Fees Reimbursement Telangana : ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యాలతో చర్చించి వేగంగా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకోవడం ద్వారా విద్యార్థుల చదవులకు ఆటంకం లేకుండా ప్రభుత్వం కృషి చేసిందనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో సంక్షోభంలో కూరుకుపోయిన ఉన్నత విద్యా సంస్థలను ఆర్థిక భారం నుంచి గట్టెక్కించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.5,500 కోట్ల బకాయిలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థలను పట్టించుకోలేదనడానికి రూ.5,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వదిలేసి వెళ్లడమే అందుకు నిదర్శనం. దీంతో తదుపరి పెరిగిన ఆర్థిక భారంతో ఇబ్బందుల్లో ఉన్న కాలేజీలు సమ్మె బాటపట్టాయి. దీంతో రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యా సంస్థలు సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. అయితే, దీనిపై వేగంగా స్పందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల చదువులు నిలిచిపోకూడదన్న ఆశయంతో చకచకా నిర్ణయాలు తీసుకుంది.
నాడు – నేడు ఎంత తేడా!
ప్రభుత్వం ఉన్నత విద్యా సంస్థల సంఘం ఫతితో రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపి విజయవంతంగా సమ్మెను విరమింపజేసింది. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంతో డిమాండ్ల సాధనకు ఎవరైనా సమ్మెకు దిగితే కనీసం వారి బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలకించేది కాదనే విమర్శలు ఉన్నాయి. కానీ, ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె ప్రకటించిన అదే రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా స్పందించింది. అర్థరాత్రి వరకు చర్చలు జరిపి సావధానంగా వారి సమస్యలు వినడమే కాకుండా వాటికి పరిష్కారం చూపడం హర్షనీయమని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయడుతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి పెండింగ్ బకాయిలను విడతలవారీగా విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఈ వారంలోనే రూ.600 కోట్ల విడుదలకు అంగీకరించింది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తమకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశమని మాటలతో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతలతో నిరూపించుకుంది.
పేద పిల్లల విద్యకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, దీన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైన అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ను విడతల వారిగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని, బకాయిలు చెల్లించలేదని ప్రభుత్వ పెద్దలు గుర్తు చేస్తున్నారు.
సంస్కరణలకు కాంగ్రెస్ శ్రీకారం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యతోపాటు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించతలపెట్టింది. రూ.21 వేల కోట్ల అంచనాలతో అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో ఈ స్కూళ్ల నిర్మాణానికి పూనుకుంది. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనుంది.
ఇక యువతకు ఉపాధి కోసం స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసి మెరుగైన శిక్షణ అందిస్తోంది. యువతను పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతోంది. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్ది అత్యాధునిక వసతులు కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల విద్యార్థులకు అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించి, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్స్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తోంది.
అలాగే గురుకులాల్లో డైట్ చార్జెస్ 40%, కాస్మెటిక్ చార్జెస్ 200% పెంచి లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తోంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తుండడం, పేద కుటుంబాల పిల్లలకు చదువు ఆర్థిక భారం కాకుండా చర్యలు తీసుకుంటోంది.
ఇవీ చదవండి: Congress : దూసుకుపోతున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.. తలసరి ఆదాయంలో తెలంగాణ, కర్ణాటక టాప్
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్న కవిత!
