Industrial Day : జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ ఎస్ గ్రీవెన్స్ డే లాగానే ప్రతి మంగళవారం ఇండస్ట్రీడే కార్యక్రమం నిర్వహించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆయన సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ప్రజంటేషన్ ఇచ్చారు.
రాష్ట్ర జీఎస్డీపీలో 44 శాతం వాటా పారిశ్రామిక రంగమే అందిస్తోందన్నారు. జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలతో జిల్లా కలెక్టర్లు స్వయంగా సంప్రదింపులు జరిపి క్షేత్ర స్థాయిలో వారికి ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు స్థాపించాలంటే ఎవరికైనా భూమి చాలా ముఖ్యమని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ సేకరణకు జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రధాన్యమివ్వాలన్నారు.
ప్రభుత్వ భూములు లభ్యత లేనిచోట ప్రైవేటు భూములు సేకరించాలంటే వారితో మాట్లాడి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ చేపట్టాలన్నారు. భూ సేకరణ విషయంలో జిల్లా కలెక్టర్లు సంక్లిష్టంగా కాకుండా కొంత సరళీకృతంగా పనిచేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ప్రతి ప్రాజెక్టు గ్రౌండింగ్ అవ్వడానికి ఒక కాలపరిమితి పెట్టుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ప్రతి ఎకనామిక్ హబ్కు ఒక జిల్లా అధికారిని నియమించి, ఆ ఎకనామిక్ హబ్లో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాల్లో పరిశ్రమలు రావాలంటే అక్కడ కలెక్టర్లు ఎలా పనిచేస్తున్నారనేది చాలా ముఖ్యమన్నారు. ఎంఎస్ ఎంఈలపైన కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా ఆర్థికాభివృద్దికి ఊతమిచ్చేవి ఎంఎస్ ఎంఈలేనని తెలిపారు.
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.10,06,799 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 122 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతమున్న 30 క్లస్టర్లు, రాబోయే 20 క్లస్టర్లకు సంబంధించి లక్ష ఎకరాలకు పైగా ఖాళీ స్థలాలు గుర్తించామన్నారు. జిల్లా కలెక్టర్లందరూ ఈ భూసేకరణకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో ఐదు చోట్ల డిఫెన్స్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం-శ్రీకాకుళం జిల్లాల మధ్య 3 వేల ఎకరాల్లో నావల్ క్లస్టర్, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3 వేల ఎకరాల్లో మిస్సైల్, అమ్యూనిషన్ క్లస్టర్, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 3 వేల ఎకరాల్లో అన్ మ్యాన్డ్ సిస్టమ్ క్లస్టర్, అనంతపురం జిల్లా మడకశిర-లేపాక్షిల మధ్య 4-5వేల ఎకరాల్లో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్, ప్రకాశం జిల్లా దొనకొండలో 4 వేల ఎకరాల్లో ఎయిర్క్రాఫ్ట్ విడిభాగాల తయారీ క్లస్టర్ ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించి 50కిపైగా ప్రాజెక్టులకు అనుమతిచ్చిందని వెల్లడించారు. వీటిపైన కూడా జిల్లా కలెక్టర్లు ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు.
ఇవీ చదవండి: Collectors Conference : మార్చి 2026 నాటికి సోలార్ 2.93 లక్షల వ్యవసాయ పంప్సెట్లు
Collectors Conference : బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాల పొదుపు రూ.20,739 కోట్లు
Collectors conference : పారిశ్రామిక వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటుకు రెట్టింపు
