Rice Procurement : ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణ లక్ష్యాన్ని ఆశ్చర్యకరంగా తగ్గించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సేకరణ లక్ష్యం 22 లక్షల మెట్రిక్ టన్నుల మేర తగ్గింది. 2024–25 సీజన్లో 4.85 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని ముందుగా ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్రం, ఇప్పుడు దాన్ని 4.63 కోట్ల మెట్రిక్ టన్నులకే పరిమితం చేసింది. ఇది గత సంవత్సరం కంటే సుమారు 5.8 శాతం తక్కువ. (Rice Procurement)
ఈ కొత్త లక్ష్యాలను కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాల కార్యదర్శులతో జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వర్షాలు బాగా పడటంతో రైతులు అధిక దిగుబడి ఆశిస్తూ 4.20 కోట్ల హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఇది సాధారణ సగటు 4.03 కోట్ల హెక్టార్ల కంటే 29.6 లక్షల హెక్టార్లు ఎక్కువ. సాగు విస్తీర్ణం పెరిగితే ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్రం మాత్రం సేకరణ లక్ష్యాన్ని పెంచకుండా తగ్గించడం ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఏటా 4.10 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అదనంగా, బఫర్ స్టాక్గా మరో 1.02 కోట్ల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచాలి. అయితే ఇప్పటికే 3.80 కోట్ల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉన్నందునే ఈసారి సేకరణ లక్ష్యాన్ని తగ్గించారని సమాచారం.
అయితే, సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ సేకరణ తగ్గడం వెనుక అసలు కారణాలను కేంద్రం స్పష్టంగా వెల్లడించకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి: Telangana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఫ్యామిలీకి రూ.18 వేలు!
