Telangana : ప్రజల నిరీక్షణకు తెరపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు దాదాపుగా 10 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. కార్డు లేని అర్హులకు కొత్త కార్డుతోపాటు.. పాత కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అదనంగా 40 లక్షల మంది లబ్ధిదారులు సన్నబియ్యం అందుకోనున్నారు. మొత్తంగా 99.97 లక్షల కుటుంబాలు సన్నబియ్యం అందుకోనున్నాయి. Telangana
రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్హత ఉన్న పత్రి లబ్ధిదారుడికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చి చివర్లో ఘనంగా ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమయ్యాక ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచితంగా సన్నబియ్యం పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 89.95 లక్షల కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు ఉండేవి. గత 11 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వకపోవడంతో లబ్ధిదారుల సంఖ్య 2.81 కోట్లకు పరిమితమైంది. అయితే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రారంభమయ్యాక అర్హులైన ప్రతిఒక్కరికి రేషన్ కార్డును అందించాలన్న లక్ష్యంగా, రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించి కొత్త కార్డుల పంపిణీకి గత జనవరిలో శ్రీకారం చుట్టింది.
జూలైలో హుజుర్నగర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఆగస్టు చివరి కల్లా కొత్తగా 9.97 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటి ద్వారా 26 లక్షల మంది లబ్ధిపొందనున్నారని తెలుస్తోంది. అలాగే పాతకార్డుల్లో కొత్త సభ్యుల చేర్పు ద్వారా మరో 12.86 లక్షల మంది అర్హత సాధించారు.
ఈ లెక్కన మొత్తంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో అదనంగా 40 లక్షల మంది రేషన్ ఫలాలను పొందనున్నారు. రేషన్ షాపుల్లో నెలవారీ కోటా కింది రాష్ట్రవ్యాప్తంగా ఇది వరకు 1.68 లక్షల టన్నుల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అవుతోంది. అయితే కొత్త రేషన్కార్డుల జారీ, కొత్త సభ్యుల చేర్పుతో సెప్టెంబర్ కోటా 1.92 లక్షల టన్నులకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
99.97 లక్షల కుటుంబాలకు ఏటా రూ.18 వేలు ఆదా
పీడీఎస్ దుకాణాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రతి కుటుంబ ఏటా సన్నబియ్యం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆదా అయ్యే పరిస్థితి ఏర్పడింది. సరాసరి ఇంటికి ఐదుగురు సభ్యులు చొప్పునా ప్రతి కుటుంబానికి నెలకు 30 కేజీల సన్నబియ్యం అందుతోంది. ఈ లెక్కన ప్రతి కుటుంబానికి నెలకు రూ.1,500 వరకు ఆదా అవుతుంది. ఇలా రాష్ట్రంలో కొత్త-పాత కలుపుకొని 99.97 లక్షల కుటుంబాలు సన్నబియ్యం అందుకోనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3.21 కోట్ల మంది లబ్ధిపొందనున్నారు.
ఈ రకంగా 99.97 లక్షల కుటుంబాలకు ఏటా రూ.18 వేలు చొప్పునా ఆదా కానుంది. మొత్తంగా తెలంగాణ ప్రజలు ఏటా సన్నబియ్యంపై ఖర్చు చేస్తున్న రూ.17,994 కోట్లు ఆదాకానున్నాయి. అంతేకాకుండా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ద్వారా లబ్ధిదారులు గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ సిలిండ్, ఆరోగ్య శ్రీ వంటి సంక్షేమ పథకాలకు అర్హత పొందినట్టైంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇంటింటికి సంక్షేమ పథకాలను చేరువ చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామగ్రామాన ఇది తమకు లాభం చేకూరుస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. ఇది గ్రామ పంచాయతీ మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు, తాము బలపరిచిన అభ్యర్థుల విజయావకాశాలను మెరుగుపరుస్తుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది.
ఇవీ చదవండి: Revanth Reddy at Delhi : బనకచెర్లపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఆసక్తికర చిట్ చాట్
CM Revanth : దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు : రేవంత్
Rajiv Yuva Vikasam : ఒక్క పథకంతో 5 లక్షల మంది యువ వ్యాపారవేత్తలు
