KCR : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన 665 పేజీల నివేదికలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను బాధ్యుడిని చేసిన విషయం తెలిసిందే. బ్యారేజీల వైఫల్యం వెనుక ప్రత్యేక్షంగా, పరోక్షంగా కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ స్పష్టం చేసింది. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, వాటర్ స్టోరేజీ సహా ప్రతి అంశంలో గత సీఎం జోక్యం చేసుకున్నారని తప్పుబట్టింది. (KCR)
ఈ నేపథ్యంలో తెలంగాణను కుదిపేస్తున్న ఈ వ్యవహారం నుంచి రాజకీయంగా బయటపడేందుకు కేసీఆర్ ప్రత్యేక వ్యూహాన్ని రచించారని, అందులో కవిత కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిని కవిత వ్యవహార శైలి, మాటతీరు.. గత రెండు రోజులుగా బీఆర్ఎస్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు.
సెప్టెంబర్ 2న కవితను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తరువాతి రోజు కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరం అవినీతి సంక్షోభం నుంచి బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్లను రక్షించేందుకు కవిత పరోక్షంగా ప్రత్నించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పు లేదు.. చేసిందంతా హరీష్రావు, సంతోష్ రావులే” అని కవిత వ్యాఖ్యానించారు. తద్వారా కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్ను ఆమె రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అర్థం అవుతందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కవిత సస్పెన్షన్, అనంతరం ఆమె రాజీనామా పరిణామాలు అన్ని కూడా కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాతే జరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.
కేసు సీబీఐకి అప్పగింతపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన తరువాతే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే, ఒక్కసారి సీబీఐ విచారణ మొదలైందటే వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ మనుగడకు కాళేశ్వరం అవినీతి సవాల్ విసురుతూనే ఉంటుంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వ్యవహారం అతిపెద్ద రాజకీయ అజెండాను సెట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ను రక్షించుకోవడానికి, కాళేశ్వరం అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా కవితను రంగంలోకి దింపారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
అందుకు అనుగుణంగానే “కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తప్పులేదు” అనే న్యారేటివ్ను ఉనికిలోకి తెచ్చిన కవిత.. హరీష్ రావు, సంతోష్ రావులపైకి నెపం నెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. “ఈ వ్యవహారంలో కేసీఆర్ తప్పులేదంటా.. అంతా హరీష్రావు, సంతోష్ రావులే చేశారని” ప్రజలను నమ్మించేలా కవిత తన వాణి వినిపిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. తద్వారా బీఆర్ఎస్ క్యాడర్ పక్కచూపులు చూడకుండా ఉంటుందనేది వారి వ్యూహంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
సొంత కూతురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇదంతా చేయించాల్సిన అవసరం కేసీఆర్కు ఏమోచ్చిందనే వాదన కూడా లేకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, గ్రామగ్రామానా దీనిపై చర్చ జరుగుతుండడంతో కేసీఆర్ ఈ వ్యూహానికి తెరలేపినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యహారంలో సీబీఐ విచారణ ప్రారంభమయ్యాక రాజకీయంగా పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, అది బీఆర్ఎస్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది కాబట్టే.. కాళేశ్వరం అవినీతిలో తన పాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కవితను ముందుపెట్టి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని నడిపస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. అందుకే కేసీఆర్ వదిలిన బాణమే కల్వకుంట్ల కవిత అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇవీ చదవండి: Kavitha Press Meet : కవిత సంచలన ప్రెస్ మీట్.. కేటీఆర్, హరీష్ రావులపై హాట్ కామెంట్స్
Kavitha Suspended: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కవిత సస్పెండ్!
