Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) ఆరోగ్య బీమా కల్పిస్తోంది. ఎన్రోల్మెంట్, అవసరమైన పత్రాలకు ఆధార్ తప్పనిసరిగా అవసరం.
ఆయుష్మాన్ భారత్ PMJAY కింద సీనియర్ సిటిజన్లకు కేంద్రం ఆరోగ్యపరంగా అండగా నిలుస్తోంది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులందరూ ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సకు అర్హులు.
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు అర్హత ప్రమాణాల విషయానికి వస్తే.. వారి ఆధార్ కార్డ్లో నమోదు చేసిన వయసు ప్రకారం నిర్ణయించినట్లుగా, సదరు వ్యక్తి తప్పనిసరిగా 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలనేది మాత్రమే అర్హత ప్రమాణం.
అర్హులైన సీనియర్ సిటిజన్ల కోసం ఆయుష్మాన్ కార్డుల నమోదు, జారీకి ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరి. AB-PMJAY సీనియర్ సిటిజన్ స్కీమ్లో నమోదు చేసుకోవడానికి అవసరమైన ఏకైక పత్రం ఆధార్. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అర్హులైన సీనియర్ సిటిజన్లందరికీ ప్రత్యేకమైన ఆయుష్మాన్ కార్డ్ జారీ చేస్తారు.
లబ్ధిదారులు నమోదు చేసుకున్న మొదటి రోజు నుంచి చికిత్సను పొందవచ్చు. ఏదైనా వ్యాధి లేదా చికిత్స కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కవరేజ్ వెంటనే ప్రారంభమవుతుంది.
ఈ పథకం కింద అర్హత కోసం ప్రభుత్వం ఎటువంటి ఆదాయ పరిమితిని నిర్ణయించలేదు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా అర్హులే. 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షలు వినియోగించుకున్నట్లయితే, వారికి అదనపు టాప్-అప్ ప్రయోజనం కూడా పొందవచ్చు. అయితే, అలాంటి వారు మళ్లీ ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే, అదనంగా రూ.5 లక్షల కవరేజీ 70 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే. కుటుంబంలోని మిగిలిన వారు ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల కవరేజీని మాత్రమే పొందగలరు.
భారతదేశంలో సుమారు 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు 70 లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవారు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఏమేం కావాలి?
ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో చేరాలంటే వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా చేరాలి. ముందు http://www.beneficiary.nha.gov.in వెబ్సైట్లోకి వెళ్లి క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ నమోదు చేసుకోవాలి. అనంతరం మీ రాష్ట్రం ఎంచుకున్నాక అక్కడ వివరాలు కనిపిస్తాయి. ఆధార్ ఈ-కేవైసీ చేయకుంటే పూర్తి చేయాలి. కేవైసీ పూర్తి చేసి ఉంటే నేరుగా ‘ఆయుష్మాన్ వయ వందన’ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వృద్ధుల తరఫున వారి కుటుంబ సభ్యులు కూడా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో దీన్ని చేసే వీలుంది. లేదా ఎంప్యానెల్డ్ ఆస్పత్రికి వెళ్లి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
దేశంలో 30 వేల ఆస్పత్రులు
ఆయుష్మాన్ భారత్ స్కీము కింద దేశవ్యాప్తంగా సుమారు 30 వేల హాస్పిటల్స్ నమోదయ్యాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల లిస్టు dashboard.pmjay.gov.in వెబ్సైట్లో కనిపిస్తుంది. అక్కడ మీ స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆస్పత్రుల డీటెయిల్స్ కనిపిస్తాయి.
చికిత్స విషయంలో గానీ, ఇతర విషయాల్లోగానీ వినియోగదారులకు ఫిర్యాదులు ఉంటే.. సదరు వెబ్సైట్, యాప్లో గానీ లేదా నేషనల్ కాల్ సెంటర్ 14555ను సంప్రదించవచ్చు. వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఇవీ చదవండి: Aam Aadmi Bima Yojana: ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకానికి ఎవరు అర్హులు?
Gut Health: మారుతున్న సీజన్.. మీ ప్రేగు ఆరోగ్యానికి 9 చిట్కాలు
World Mental Health Day: మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం 10 టిప్స్
Muscle Health Food: ఎముకల పటిష్టత కోసం ఈ ఫుడ్స్ తీసుకోవడం మర్చిపోకండి!
Ganji for Health: రోజుకో గ్లాసు గంజి తాగితే శరీరంలో ఆశ్చర్యపరిచే మార్పులు..!
