AP Elections: ప్రతిపక్షం లేని చోటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరం. అయితే, ఎన్నికల్లో తీర్పులు కొందరు అనుకున్న దాని కంటే భిన్నంగా, మరికొందరు అనుకున్న విధంగానూ వస్తుంటాయి. కానీ, ఏకపక్ష తీర్పులపై చరిత్ర గమనిస్తే ఆశ్చర్యపరిచే నిజాలు తెలుస్తాయి. గత రెండు ఎన్నికలుగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే.. ప్రజాస్వామ్యంలో ఎందుకు ఈ పరిస్థితి వస్తోందన్న ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యంగా ప్రజలు ఏకపక్ష తీర్పులు ఇస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా పని చేసిన జగన్.. ఆ తర్వాత తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఒంటరి అయ్యారు. ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి 16 నెలల పాటు బెయిల్ కూడా రాకుండా జైల్లో పెట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అటు తర్వాత జగన్కు జనం జైకొట్టారు. ఎంపీగా 5.45 లక్షల మెజార్టీతో గెలిపించారు. వైయస్ విజయమ్మను సైతం పులివెందులలో భారీ మెజార్టీతో గెలిపించారు.
ఇక అటు తర్వాత 2014 ఎన్నికల్లో వైయస్ జగన్ ఓడాక చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసెంబ్లీలో మైకు ఇవ్వలేదన్న కారణం, ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారన్న కారణాలతో వైయస్ జగన్ అసెంబ్లీనే బాయ్ కాట్ చేశారు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి నేరుగా కలవడం మొదలు పెట్టారు. అశేష జనసందోహం ఆయన వెంట కదిలింది. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విధంగా జగన్కు 151 సీట్లు వచ్చాయి. టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు సాగించిందన్న ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతలపై కేసులు పెట్టడం, చంద్రబాబును జైల్లో పెట్టించడం, అవినీతి కేసుల పేరిట టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారన్న అపవాదు మూటగట్టుకున్నారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో జగన్కు కేవలం 11 సీట్లే వచ్చాయి.
ఇలా జరగడాన్ని ఎలా చూడాలి? అసలు గత చరిత్ర ఏం చెబుతోంది. నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారా? వారి సమయం వచ్చినప్పుడు విపరీత పోకడలపై అడ్డుకట్ట వేస్తూ తమదైన శైలిలో ఏకపక్ష తీర్పులు ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం రాక తప్పదు.
1989లో మొదటిసారి ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు ఎంజీ రామచంద్రన్ భార్య వర్సెస్ జయలలిత రాజకీయాలు నడిచాయి. పార్టీ తనదంటే తనదేనంటూ పోటీ పడ్డారు. 1989లో క్లియర్ గా 169 సీట్లు కరుణానిధి పార్టీకి వచ్చాయి. కేవలం 30 సీట్లు మాత్రమే జయలలిత పార్టీకి వచ్చాయి. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1991లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఎల్టీటీఈ ఇష్యూ రావడంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వచ్చారు. దీంతో జయలలిత ఏకంగా 225 సీట్లు దక్కించుకున్నారు. కరుణానిధి పార్టీకి కేవలం 7 సీట్లే దక్కాయి.
కానీ ఆయన కుంగిపోయి ఇంట్లో కూర్చోలేదు. ఐదేళ్లపాటు సమర్థంగా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అటు తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి ఏకంగా 221 సీట్లు కైవసం చేసుకున్నారు. జయలలిత ఈసారి కేవలం 4 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 2011లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ 203 సీట్లతో జయలలిత ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లోనూ జయలలిత ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు.
ఇలా రాజకీయాల్లో ఎప్పుడూ నిస్సత్తువ, నిర్లప్తత లేకుండా, పడిన చోటే మళ్లీ కసిగా తిరిగి ప్రజల్లోకి వెళ్లి ప్రజల పక్షాన పోరాడిన నేతలను ప్రజలు అంతే ఎత్తుకు లేపి విజయాన్ని కట్టబెడతారని అనేక సందర్భాల్లో చరిత్ర రుజువు చేసింది. 2019లో 23 సీట్లకు పడిపోయిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ ఎర్రటి ఎండలో ప్రజల తరఫున పోరాడి, అన్ని శక్తులూ కూడగట్టుకుని గెలిపించుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ పరిస్థితి కూడా అంతే. ఆయనలో దాగి ఉన్న పొలిటికల్ పోరాట పటిమ చూపి.. ఈ ఐదేళ్లు పార్టీని కాపాడుకుంటూ కేడర్లో ధైర్యం నింపుతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడితే 2029లో ఇంతే రివర్స్ ఫలితం వచ్చినా ఆశ్చర్యం ఉండదు. కావాల్సిందల్లా ఓపిక, పట్టుదల అని చరిత్ర నేర్పిన పాఠం తెలుసుకోవాలి.
ఇవీ చదవండి: Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ’మెగా‘ ‘పవర్?’
CBN Cabinet: కొలువుదీరిన చంద్రబాబు కేబినెట్.. మంత్రులు వీరే
Chandrababu Food: చంద్రబాబు బతకడానికి ఏం తింటారో తెలుసా? ఫుడ్ డైట్ ఇదీ..
Roads: రోడ్లపై గుంతలా? దానంతట అదే పూడుకుపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది!
