Modi new year wishes: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడం పై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. జీ-20 విజయవంతం పై ప్రజలు లేఖలు రాసి గుర్తు చేశారని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం భారత్ లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని వెల్లడించారు. దేశ ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని వ్యాఖ్యానించారు. (Modi new year wishes)
దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తి రగిలించిందని ప్రధాని తెలిపారు. 2024లోనూ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలన్నారు. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా నిరూపించామన్నారు. శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్-3 విజయవంతం అందరికీ గర్వకారణం అని మోదీ తెలిపారు. ‘నాటు…నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని తెలిపారు. ఎలిఫెంట్ విస్పరర్స్ కు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందన్నారు. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామన్నారు.
ఈ ఏడాది క్రీడల్లో మన అథ్లెట్లు ప్రతిభ చూపారని ప్రధాని మోదీ తెలిపారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్ లో 111 పతకాలతో సత్తా చాటారని మెచ్చుకున్నారు. వన్డే ప్రపంచ కప్ లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచిందన్నారు. అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో మహిళల జట్ల విజయం ప్రేరణగా నిలుస్తుందని కామెంట్ చేశారు. ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్వించేలా చేశాయన్నారు.
2024 పారిస్ ఒలింపిక్స్ కు భారత క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారని మోదీ తెలిపారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతంగా నిర్వహించామని ప్రధాని తెలిపారు. ‘మేరీ మాటీ-మేరా దేశ్’ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వామ్యం అయ్యారని సంతోషం వెలిబుచ్చారు. దేశంలో 70 వేలకు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.
ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నోవేషన్ హబ్ గా మారిందని తెలిపారు. 2015లో 81వ ర్యాంకులో ఉండగా… ప్రస్తుతం 40వ ర్యాంకుకు చేరామని, గర్వంగా ఉందన్నారు. ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటెంట్ల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయని మోదీ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: Modi Youtube Channel: 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు.. దూసుకెళ్తున్న ప్రధాని మోదీ యూట్యూబ్ చానల్
