Manthena Satyanarayana Raju: ప్రకృతి ఆశ్రమం స్థాపించి తెలుగు ప్రజలకు సహజసిద్ధ ఆహార పదార్థాలను, యోగా, ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు. నేటి కంప్యూటర్ యుగంలో ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న వారిని ఆయన సరిదిద్దేందుకు, సక్రమమైన మార్గంలో నడిపేందుకు, ఆహారం, ఆరోగ్యంపై ప్రజల్లోఅవగాహన కల్పిస్తూ మెరుగైన జీవనవిధానాన్ని పాటించేలా విలువైన సూచనలు సలహాలు ఇస్తుంటారు. (Manthena Satyanarayana Raju)
ఈ ఆశ్రమం విజయవాడకు దగ్గర్లోని ఉండవల్లి సమీపంలో ఉంది. విజయవాడ నుంచి కరకట్ట రోడ్డు మీద వెళ్తే రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీకి వెళ్లే దారిలో ఈ ఆశ్రమం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా పలు రకాల చెట్లతో సుందరంగా ఈ ఆశ్రమం మనకు కనిపిస్తుంది. కరకట్ట రోడ్డుకు కుడివైపున పెద్ద ముఖద్వారం మీకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడికి రోజూ పలు రకాల వ్యక్తులు వస్తుంటారు. ఆరోగ్యంపై అభిలాష, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులతో సహా అనేక మంది సామాన్యులు సైతం వస్తుంటారు.
అందరికీ ఆసక్తికరంగా ఉండే విషయం ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో అసలు దినచర్య ఎలా ఉంటుందనేది అందరూ తెలుసుకోవాలని కోరుకొనే అంశం. ఆశ్రమంలో ఉదయం 5 గంటలకే నిద్ర మేల్కొనడంతో దినచర్య మొదలవుతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు యోగా, ప్రాణాయామ శిక్షణ ఉంటుంది. ఇక ఉదయం 7 నుంచి 8 గంటల దాకా యోగా సంబంధ క్రియలు అంటే ఎనిమా, జలనేతి, సూత్రనేతి, గజకర్ణి, వస్త్రదౌతి లాంటివి ఉంటాయి. అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అల్పాహారం ఉంటుంది. అంటే మన ఇంట్లోమాదిరి ఓ ఐదారు ఇడ్లీలు, పూరీలు, దోశలు, గారెలు ఉండవండోయ్.. చిరుధాన్యాలు, రాగి జావ మాత్రమే పెడతారు. అనంతరం 9 గంటల 15 నిమిషాల వరకు మంచి మాట ఉంటుంది.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ప్రకృతి వైద్య చికిత్సలు, ఫిజియోథెరపీ ఉంటాయి. అంటే మసాజ్, స్టీమ్ బాత్, సోనా బాత్, టబ్ బాత్ లాంటివన్నమాట. ఇవన్నీ సరే.. భోజనం ఎప్పుడంటారా? ఆ విషయానికే వస్తే.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట దాకా జబ్బులను తగ్గించే వంటలతో భోజనం ఉంటుంది. ఇందులో ఉప్పు, నూనెలు లేని కూరలు, పుల్కాలు మాత్రమే ఉంటాయి. ముడిబియ్యం అన్నం ఉంటుంది. అది కూడా పరిమితంగానే. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు విశ్రాంతి. రెండు నుంచి నాలుగున్నర దాకా ప్రకృతి వైద్య చికిత్సలు, ఫిజియోథెరపీ ఉంటాయి. అంటే మడ్ బాత్, శాన్డ్ బాత్, సన్ బాత్, నీటిచికిత్సలు, ఈత లాంటివి.
సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య అధిక బరువు, కొవ్వును కరిగించే వ్యాయామాలు ఉంటాయి. సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల దాకా వంటకు సంబంధించిన క్లాసులుంటాయి. దీంతోపాటు నడవడం, నదిలో పడవ తొక్కడం, ఈత కొట్టడం, ఆటలు ఆడుకోవడం, కోలాహుప్స్, బాల్ వ్యాయామాలు ఉంటాయి. సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల దాకా రాత్రి భోజనం ఉంటుంది. అంటే కేవలం పండ్లు, పచ్చి కూరలే పెడతారు. ఇక రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర మధ్య ఆరోగ్య ప్రసంగం ఉంటుంది. రాత్రి తొమ్మిదిన్నర నుంచి తెల్లవారుజామున 5 వరకు నిద్ర. ఇదీ అక్కడి దినచర్య.
నిద్రపోకుండా ఫోన్లు చూస్తుండటం, మధ్యలో లేచి అందర్నీ డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తే అక్కడి నుంచి పంపేస్తారు. ఫీజు నాన్ ఏసీ రూమ్ అయితే టూ షేరింగ్ 15 రోజులకు 29 వేల వేల దాకా ఉంటుందట. అదే ఫోర్ షేరింగ్ అయితే 24 వేల దాకా ఉంటుంది. ఇదే కేటగిరీలో ఏసీ గదుల్లో అయితే మరికాస్త ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఇక వివిధ రకాల జబ్బులతో బాధపడేవారికి ట్రీట్మెంట్ కోసం వైద్యులు సూచించిన మేరకు టెస్టులు, వైద్యం, చికిత్సల కోసం అదనంగా డబ్బు ఖర్చు అవుతుందట.
