తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతన్నలను అతలాకుతలం చేశాయి. ఏపీలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan) సమీక్ష నిర్వహించారు. అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పంటలు నష్టపోయిన రైతుల జాబితా తయారు చేసి త్వరగా పరిహారం రెడీ చేయాలని సూచించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం జగన్ (YS Jagan). ఇక ఏపీలో వర్షాలు రైతులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి. అన్ని రకాల పంటలు వేసిన రైతులు నష్టపోయారు.
సమీక్ష సందర్భంగా సీఎం జగన్.. (YS Jagan) రైతులపై అకాల వర్షాలు ఎంత మేర ప్రభావం చూపించాయి? ఎన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందనే విషయాలను అధికారులను అడిగిత తెలుసుకున్నారు. వర్షం ధాటికి తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. దీనిపై అభ్యంతరాలకు తావులేదని, పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
తక్షణమే పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. రైతులకు వెస్సార్ రైతు భరోసా నిధులు కూడా ఈ నెలలోనే అందించాలని సీఎం జగన్ చెప్పారు. దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
ఏయే జిల్లాల్లో పంట నష్టం జరిగిందే ఆయా ప్రాంతాల్లో బాధిత రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. వాటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని సూచించారు. మార్చి నెలలో జరిగిన పంట నష్టాలపై నివేదికలు సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు సంబంధించిన పంట నష్టం అంచనాలను పది రోజుల్లోగా పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. ఇక ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో చెదురుమదురు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈదురుగాలులు వీచే ఆస్కారం ఉందని, గంటకకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం కూడాచాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వానలు పడ్డాయి. పశ్చిమగోదావరి, నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. ఇక రాగల మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు, సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ముఖ్యంత్రి జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. రైతులు అల్లాడుతున్నారని, ఆదుకోవాలని కోరారు. పంట కొనుగోలు బాధ్యత ప్రభుత్వానిదేనని, పట్టించుకోవాలని విన్నవించారు.
Read Also : AP DSC 2023 : ఏపీలో ఎన్నికల ముంగిట డీఎస్సీకి సన్నాహాలు.. ఎన్ని పోస్టులు భర్తీ?
