Mood of Andhra Survey: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ పేరుతో వెలువడిన తాజా సర్వే ఫలితాలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిగా బరిలోకి దిగినప్పటికీ వైఎస్సార్సీపీ అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశముందని ఈ సర్వే అంచనా వేసింది. కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైఎస్సార్సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించవచ్చని పేర్కొంది. హైదరాబాద్కు చెందిన ‘ఐఐటీయన్స్ గ్రూప్’ నిర్వహించినట్లు ప్రచారంలో ఉన్న ఈ సర్వేను రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టినట్లు సమాచారం. జూన్ 18 నుంచి ఆగస్టు 20 వరకు మూడు దశల్లో 1,90,550 మంది అభిప్రాయాలను నేరుగా సేకరించినట్లు సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు.
రైతులు, కౌలు రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు, యువతతోపాటు వివిధ సామాజిక, వయసు వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.
కూటమిగా పోటీ చేసినా వైసీపీకి ఆధిక్యం!
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి.. వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దిగితే వైసీపీకి 45.5 శాతం, కూటమికి 44.5 శాతం ఓట్లు లభించే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఈ ఓట్ల శాతం ఆధారంగా వైఎస్సార్సీపీకి 83, కూటమికి 62 స్థానాలు దక్కవచ్చని పేర్కొంది. మిగిలిన 30 నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అంటే కూటమిగా పోటీ చేసినప్పటికీ వైసీపీ గెలుపును అడ్డుకోవడం కష్టమవుతుందనే సంకేతాలను సర్వే ఇచ్చింది.
విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి స్పష్టమైన మెజార్టీ
టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని ‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వే అంచనా వేసింది. ఈ పరిస్థితిలో వైఎస్సార్సీపీకి 47 శాతం, టీడీపీకి 36 శాతం ఓట్లు లభించవచ్చని పేర్కొంది. సీట్ల పరంగా వైఎస్సార్సీపీ 110 నుంచి 112 స్థానాలు, టీడీపీ 43 నుంచి 45 స్థానాలు గెలుచుకునే అవకాశముందని తెలిపింది. జనసేన 2 నుంచి 4 స్థానాలకే పరిమితం కావచ్చని, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవచ్చని అంచనా వేసింది.
వైసీపీ, టీడీపీ విడిగా.. జనసేన–బీజేపీ కలిసి పోటీ చేస్తే?
వైఎస్సార్సీపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేసి, జనసేన–బీజేపీ కలిసి బరిలోకి దిగితే వైసీపీకి 46.5 శాతం, టీడీపీకి 35 శాతం, జనసేన–బీజేపీ కూటమికి 10.5 శాతం ఓట్లు రావచ్చని సర్వే పేర్కొంది. ఈ సమీకరణంలో వైఎస్సార్సీపీకి 95 నుంచి 96, టీడీపీకి 40 నుంచి 41, జనసేన–బీజేపీ కూటమికి 7 నుంచి 9 స్థానాలు దక్కవచ్చని అంచనా వేసింది.
ముఖ్యమంత్రి ఎంపికలో జగన్కు 44 శాతం మద్దతు
తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు 44 శాతం మంది వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపినట్లు సర్వే వెల్లడించింది. చంద్రబాబు నాయుడికి 32 శాతం, పవన్ కల్యాణ్కు 6 శాతం, నారా లోకేశ్కు 5 శాతం మంది మద్దతు తెలిపినట్లు పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనదనే ప్రశ్నకు వైఎస్సార్సీపీకి 44.5 శాతం, కూటమికి 40 శాతం మద్దతు లభించినట్లు తెలిపింది. గత వైసీపీ పాలన బాగుందని 41 శాతం మంది చెప్పగా, ప్రస్తుత కూటమి పాలన బాగుందని 38 శాతం మంది అభిప్రాయపడినట్లు పేర్కొంది. రెండు ప్రభుత్వాల పాలన ఒకేలా ఉందని మరో 12 శాతం మంది చెప్పినట్లు సర్వే వివరించింది.
కూటమి పాలనపై అసంతృప్తి?
కూటమి ప్రభుత్వ పనితీరుపై 4 శాతం మంది అత్యంత సంతృప్తిగా, 30 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు సర్వే తెలిపింది. మరోవైపు 45 శాతం మంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని 42 శాతం మంది అభిప్రాయపడగా, వ్యతిరేకత లేదని 36 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది. 2029 ఎన్నికల్లో కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని 39 శాతం మంది భావించగా, అధికారంలోకి రాదని 44 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలిపింది.
ప్రధాన సమస్యలుగా అవినీతి, రైతుల కష్టాలు
రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని 27 శాతం మంది ప్రస్తావించినట్లు సర్వే పేర్కొంది. రైతులు, కౌలు రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడాన్ని 25 శాతం, నిరుద్యోగాన్ని 21 శాతం, శాంతిభద్రతలను 15 శాతం, సంక్షేమ పథకాల అమలులో సమస్యలను 12 శాతం మంది ప్రధాన అంశాలుగా పేర్కొన్నట్లు వెల్లడించింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని 48 శాతం మంది అభిప్రాయపడగా, అక్రమాలు జరగలేదని 39 శాతం మంది చెప్పినట్లు సర్వే తెలిపింది.
కూటమి ఎమ్మెల్యేల్లో 72 మంది ‘రెడ్ జోన్’లో?
నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేల పరిస్థితిని కూడా సర్వే విశ్లేషించినట్లు సమాచారం. మొత్తం 175 స్థానాల్లో 72 మంది ఎమ్మెల్యేలను రెడ్ జోన్లో, 30 మందిని ఆరెంజ్ జోన్లో, 73 మందిని గ్రీన్ జోన్లో ఉంచినట్లు పేర్కొంది. కూటమి మంత్రుల్లో 10 మంది రెడ్ జోన్లో, ఎనిమిది మంది ఆరెంజ్ జోన్లో, ఏడుగురు గ్రీన్ జోన్లో ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. రెడ్ జోన్లో ఉన్న ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందనే అర్థంలో ఈ వర్గీకరణ చేసినట్లు తెలుస్తోంది.
రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైఎస్సార్సీపీ.. తాజా సర్వే అంచనాల్లో తిరిగి బలమైన స్థితికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం, స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అంశాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేస్తున్నట్లు ఈ అంచనాలు సూచిస్తున్నాయి. అయితే, ఇవి ఒక సంస్థ నిర్వహించినట్లు ప్రచారంలో ఉన్న అభిప్రాయ సేకరణ ఫలితాలు మాత్రమే.
Read also: Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల నుంచి 5.56 లక్షల మంది విద్యార్థులు దూరం: వైఎస్ జగన్
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. ఈ-ఆటో కొనుగోలుకు భారీ రాయితీ, తక్కువ వడ్డీతో బ్యాంక్ లోన్
Andhra Pradesh: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా జె.శ్యామలరావు.. కీలక శాఖల్లో కొత్త అధికారులు






