Perni Nani: అరవై సంవత్సరాలు నిండకనే రాజకీయ వైరాగ్యం వచ్చేసిన మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడిని రాజకీయాల్లోకి తేవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ వారసత్వం చాలా మందికి వచ్చిందని, తాను కూడా వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఓ టీవీ చానల్లో క్వశ్చన్ అవర్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
“రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లయ్యింది. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశా. పదేళ్లయినా నా కోసం బతుకుదామనే ఆలోచనతో పోటీ చేయట్లేదు. నా సీటు త్యాగం చేశానని నేను అనుకోవట్లేదు. ఏ పార్టీలో అయినా పలుకుబడితో సీటు తెచ్చుకోగలరు. ఎవరైనా జనాదరణతోనే చట్టసభల్లో అడుగుపెట్టగలరు. వైసీపీకి ఎప్పుడు సేవలందిండానికైనా సిద్ధమని జగన్ తో చెప్పా. పార్టీ పరంగా ఏ పని అప్పగిస్తే ఆ పని చేసేందుకు సిద్ధం.
జగన్ ను బెదిరించేవారు, బ్లాక్ మెయిల్ చేసేవారు ఎవ్వరూ లేరు. నా కుమారుడికి రాజకీయాలంటే పిచ్చి. ఇక రాజకీయాలు చాలు అని నేను కరోనా కాలంలోనే అనుకున్నా. అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిదే కష్టతరమైన పాత్ర. ఇక నాపాత్ర చాలా సులువైన పాత్ర. ప్రజలు నొచ్చుకోకుండా మాట్లాడడం కత్తిమీద సాములాంటిది. మంత్రి పదవి నేను ఆశించలేదు. జగన్ అవకాశం ఇవ్వడంతో మంత్రి పదవి దక్కింది. 2009లో వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించా.
పవన్ కల్యాణ్ తో నాకు వ్యక్తిగతంగా గొడవల్లేవు. మా నాయకుడిని విమర్శిస్తున్నప్పుడు పవన్ ను నేను విమర్శించాను. మిగతా వారి కన్నా జగన్ అంటే నాకు పిచ్చి ఎక్కువ. పవన్ భార్యల గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మా లీడర్ ను అవమానిస్తున్నప్పుడు నేను మాట్లాడకుండా ఉండలేను. జగన్ ఎవరి గురించి వ్యక్తిగత దూషణలు చెయ్యలేదు. కోర్టులంటే లెక్కలేకుండా జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా. అన్ని ఆరోపణలు చేస్తుంటే ఎదురు మాట్లాడకుండా ఎలా ఉంటారు?
బాబాయ్ ను చంపారని అంటారా? జగన్ పై ఆరోపణలు చేసే నేతల వద్ద ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు, వైఎస్ గజ దొంగ అని ఎలా అంటారు. ఓ రాజకీయ పార్టీ, ఓ నేత కోసం పనిచేసే పవన్ ను ఏమనాలి? 2018 వరకు చంద్రబాబు, పవన్ కలిసే ప్రభుత్వం నడిపారు. ఆ తర్వాతే పవన్ కల్యాణ్ లోకేష్ ను తిడుతూ వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే 2019లో పవన్ విడిగా పోటీ చేశారు.
జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా పనిచేసే నేత పవన్. 2024లో మెజార్టీ కాపులు వైయస్సార్సీపీకి అండగా ఉంటారు. 50 నుంచి 60 శాతం కాపులు జగన్ కు ఓటేస్తారు. కాపులు గర్వపడేలా నా ప్రవర్తన ఉంటుంది. బందరు పోర్ట్ మా పేర్ని నాని చేస్తున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2025లో బందరు పోర్టు షిప్ వచ్చి ఆగుతుంది. రైతులకు చెందిన సెంటు భూమి తీసుకోకుండానే బందరు పోర్ట్ నిర్మాణం. ప్రభుత్వ భూముల్లోనే పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. రైతులు అంగీకరించి చిరునవ్వుతో ఇచ్చిన భూమినే తీసుకున్నాం.
అన్ని కులాలు, అన్ని ఊర్లకు మంచి చేసే నన్ను ఆదరిస్తారు. 40 ఏళ్లుగా మచిలీపట్నంలో గెలిచిన పార్టీయే ఏపీలో అధికారంలోకి వచ్చింది. బందరు ఓటర్లకు ఏపీ నాడి తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా బందరులో సినిమా టాక్ గురించి అడిగేవారు. కాపులంతా ఒకే పార్టీ వైపు ఉండరు. 175 సీట్లలో జనసేన దాదాపు సగం సీట్లు తీసుకుంటే కాపులు పవన్ ను ఆదరించేవారేమో. పవన్ కు రెండేళ్ల పాటు సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు అంటే కాపులు అండగా నిలబడేవారేమో. చంద్రబాబు సీఎం కావడానికి కాపులు జనసేనకు అండగా నిలబడరు.
ఏపీ రాజకీయాలను శాసించేది రెడ్డి, కమ్మ, కాపు సామాజికవర్గాలే కాదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అన్ని కులాల ప్రభావం ఉంటుంది. కుల రాజకీయాలు తెలంగాణలోనూ ఉన్నాయి. సీఎం జగన్ ను తిట్టిన నేతలను వైయస్సార్సీపీ నేతలంతా తిడతారు. మా అధ్యక్షుడిని తిడితే పార్టీలో ఉన్న అన్ని కులాల నేతలు కౌంటర్ అటాక్ చేస్తారు. 2014, 2019, 2024లో కాపులకు ఎక్కువ టికెట్లు ఇచ్చిన పార్టీ వైయస్సార్సీపీ. ఏ వర్గానికయినా అత్యధిక సీట్లు ఇచ్చేది వైయస్సార్ సీపీనే.” అని పేర్ని నాని కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి: Perni Nani: చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు: పేర్ని నాని
Perni Nani: వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది బాబే: పేర్ని నాని
Perni Nani Comments: మోదీజీ.. వెనుక నుంచి చంద్రబాబు రాకుండా చూసుకోండి: పేర్ని నాని
Perni Nani on Kollu Ravindra: బందరులో పేర్ని నాని వర్సెస్ కొల్లు రవీంద్ర.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ వేడి!
